TS Polls: బీజేపీ మరో ప్రజారాజ్యం అవుతుందా ? గ్రౌండ్ రియాల్టీ ఏంటి ?
తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ముఖాముఖీ పోరు సాగుతోంది. అయితే బీఆర్ఎస్, లేకపోతే కాంగ్రెస్ అన్న చందాన ఎన్నికలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఉపఎన్నికల్లో గెలుపుతో రాష్ట్రంలో ఈసారి అధికారం ఖాయమన్న ధీమా నుంచి ఇప్పుడు కనీస అభ్యర్ధులను గెలిపించుకుంటే చాలని భావిస్తున్న బీజేపీ ఏం చేయబోతోందన్న ఆసక్తి ఓటర్లలో కనిపిస్తోంది.
తెలంగాణలో ఇప్పటివరకూ వెలువడిన అన్ని ఒపీనియన్ పోల్స్ లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ తర్వాత మూడో స్ధానంలో మాత్రమే బీజేపీ ఉంది. మరికొన్ని సర్వేల్లో అయితే ఎంఐఎం తర్వాత నాలుగో స్ధానంలో కూడా నిలిచింది. దీంతో గతంలో వచ్చిన హైప్ అంతా పోయి ఇప్పుడు కనీస సీట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడాలని బీజేపీ నేతలు భావించే పరిస్దితి వచ్చేసింది. కానీ ఇంత ప్రతికూలత మధ్య కూడా బీజేపీ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ అవకాశాలకు దెబ్బకొట్టేలా కనిపిస్తోంది.

గతంలో 2009లో జరిగిన ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీతో పోటీ పడిన ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా గెల్చుకున్నవి కేవలం 18 సీట్లే. తెచ్చుకున్నవి మాత్రం 70 లక్షల ఓట్లు. చూసేందుకు ఇందులో ఏముంది అన్నట్లుగా కనిపిస్తున్నా అంతిమంగా మహాకూటమి రూపంలో కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ ను సైతం కలుపుకుని బరిలోకి దిగిన టీడీపీని అధికారానికి దూరం చేసేసింది. గెలిచినవి 18 సీట్లే అయినా దాదాపు 70 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను చీల్చేసింది. దీంతో విపక్ష టీడీపీ అధికారానికి దూరంగా ఉండిపోయింది. కాంగ్రెస్ బొటాబొటీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు బీజేపీ కూడా దాదాపు అదే పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. అయితే అప్పటి ప్రజారాజ్యం పార్టీకీ, ఇప్పుడు బీజేపీకి ఎక్కడా పోలిక లేదు. ఎందుకంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తొలిసారిగా క్లీన్ ఇమేజ్ తో బరిలోకి దిగింది. అలాగే చిరంజీవి చరిష్మా, కాపుల ఓట్ల ఏకీకరణ వంటి ఎన్నో అంశాలు పనికొచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీ పరిస్ధితి వేరు. ఉపఎన్నికల్లో తెచ్చుకున్న వాపు, కేంద్రంలో అధికారంలో ఉన్నామనే సానుకూలత మినహా బీజేపీకి ఏ పాజిటివ్ అంశమూ కనిపించడం లేదు. అలాగే లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కాకపోవడంతో బీఆర్ఎస్ తో కుమ్మక్కు అన్న వాదన బీజేపీని నిండా ముంచుతోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ పోరులో బీజేపీ పాత్ర నామమాత్రంగా మారిపోయింది. దీంతో జాతీయ మీడియా సైతం బీజేపీ ఈ ఎన్నికల్లో చేసేదిమీ లేదనే విశ్లేషణలు వినిపిస్తోంది. కానీ గేమ్ స్పాయిలర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటోంది. కానీ క్షేత్రస్దాయిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా సాగుతున్న వార్ లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు వచ్చిన సర్వేలు, మౌత్ టాక్ అన్నీ కలిపి ఇప్పుడు మరో పార్టీ దూరలేనంత టైట్ వాతావరణం తెచ్చేశాయి. దీంతో చిన్నా చితకా పార్టీలు సైతం పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ గేమ్ స్పాయిలర్ పాత్ర కూడా పోషించడం కష్టమే.












Click it and Unblock the Notifications