అభ్యర్థుల ఎంపికలో బీజేపీ నయా స్ట్రాటజీ... వర్కవుట్ అవుతుందా?
తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే అధికార బి ఆర్ ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలని కసరత్తు చేస్తుంటే, కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ తో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఇక బిజెపి తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమర క్షేత్రంలోకి దూకుతుంది.
అయితే బీజేపీకి ఉన్న ప్రధానమైన మైనస్ అభ్యర్థులను చివరి నిముషం వరకు ఖరారు చెయ్యకపోవటం. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థి చరిష్మా ఉన్న నాయకులే కనపడకపోవటం. కానీ ఈసారి బీజేపీ ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి నుండే దృష్టి సారిస్తుంది. ఆశావహులు నియోజకవర్గాల్లో పర్యటించటంతో పాటు, తమ అభీష్టాన్ని అధిష్టానానికి తెలియజేస్తున్నారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ కొత్త స్ట్రాటజీని అనుసరిస్తుంది.

నియోజకవర్గాల వారీగా ఆశావహుల జాబితా బేస్ చేసుకుని నియోజక వర్గ ఓటర్ల మొబైల్ నంబర్స్ కు ఫోన్ కాల్ చేసి బీజేపీ నుండి మీకు మీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎవరు ఉంటే బాగుండు అనిపిస్తుంది అని ప్రశ్నించి ఆప్షన్స్ గా ఆశావహులపేర్లు ఇస్తున్నారు. ఎవరికి ఓటర్ల నుండి ఎక్కువ మద్దతు లభిస్తుందో వారికే టికెట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో ఈ తరహా సర్వే మొదలుపెట్టింది బీజేపీ.
ఈ ప్రయోగం ద్వారా ప్రజలకు తెలిసిన, ప్రజా క్షేత్రంలో నిత్యం ఉండే నాయకులకే అవకాశం ఇవ్వటానికి వీలవుతుందని బీజేపీ భావిస్తుంది. ప్రజల నుండి ఎక్కువ మద్దతు వచ్చిన నాయకులకు టికెట్ ఇస్తే విజయావకాశాలు సునాయాసం అవుతాయని కూడా బీజేపీ భావిస్తుందని తెలుస్తుంది. అందుకే ఈ తరహా నయా స్ట్రాటజీతో బీజేపీ ముందుకు వెళ్తుంది.
నియోజకవర్గాలలో నిత్యం తిరుగుతూ ప్రజల్లో మమేకమైన నాయకులకు కాకుండా ఎన్నికల సమయంలో జనాల్లో కనిపించని నాయకులకు టికెట్లు ఇవ్వటం కూడా బీజేపీకి చాలా సందర్భాలలో మైనస్ అయ్యింది. అందుకే ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో స్పష్టమైన విధానంతో బీజేపీ అధినాయకత్వం ముందుకు వెళ్తున్నట్టు తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది.












Click it and Unblock the Notifications