చంద్రబాబు అనుభవాల్ని పట్టించుకోని కేసీఆర్-2023లో గెలవాలంతే ? మోడీ మీద పోరుతో హైడ్రామా!
2018లో కేంద్రంలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న టీడీపీ.. అకస్మాత్తుగా బీజేపీతో విభేదించి ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ గుడ్ బై చెప్పేసింది. తనకున్న ఇద్దరు కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరితో రాజీనామాలు చేయించింది. అంతటితో ఆగకుండా బీజేపీపై ధర్మపోరాటానికి సిద్ధమయ్యారు చంద్రబాబు. అయితే 2019లో చంద్రబాబు ఒకటి తలిస్తే ప్రజలు మరోటి తలిచారు. సీన్ కట్ చేస్తే రాష్ట్రంలో టీడీపీ ఓటమిపాలు కాగా.. కేంద్రంలో టీడీపీతో కలిసిన 21 పార్టీలు తేలిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ ఈ అనుభవాన్ని లైట్ తీసుకుంటున్న తీరు ఆయనపై అనుమానాల్ని రేకెత్తిస్తోంది.

కేంద్రంతో టీఆర్ఎస్ పోరు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ .. తెలంగాణలో వడ్లు కొనలేదనే కారణంతో పోరు ప్రారంభించిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్.. ఇప్పుడు దాన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ సీఎం కేసీఆర్.. బీజేపీ వ్యతిరేకతను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతీ పార్టీ నేతనూ కలుస్తూ కేసీఆర్ తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. బీజేపీపై పోరాటంలో తనకు అండగా నిలవాలని విజ్ఢప్తి చేస్తున్నారు. అయితే ఆయా పార్టీలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నాయి.

తెలుగు నేతల్ని నమ్మని వైనం
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అంతకు ముందు తనకు కేంద్రంలో చక్రం తిప్పిన అనుభవాలతో 2019లో భారీ విపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 పార్టీల్ని బీజేపీకి వ్యతిరేకంగా కూడగట్టారు. అయితే సొంత రాష్ట్రంలో తనకు పరిస్ధితులు అనుకూలంగా ఉన్నాయో లేదో కూడా చూసుకోలేదు. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే తరహాలో స్వరాష్ట్రంలో పరిస్ధితులు పూర్తిగా అనుకూలంగా లేవని తెలిసీ జాతీయ స్ధాయిలో బీజేపీపై పోరుకు సిద్ధమవుతున్నారు.
గతంలో ఓసారి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీ వ్యతిరేక కూటమి తయారు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన కేసీఆర్..మరో ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు అనుభవాల నేపథ్యంలో తెలుగు నేతల్ని నమ్మేందుకు ఇతర ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవు.

చంద్రబాబు అనుభవాన్ని విస్మరిస్తున్న కేసీఆర్
టీడీపీ అధినేత, ఒకప్పుడు తన పార్టీ అధినేత అయిన చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా చేసిన పోరాటం ఏ స్ధాయిలో విఫలమైందో కేసీఆర్ కు తెలుసు. అప్పట్లో చంద్రబాబుకు కలిసొచ్చిన నేతలు కూడా ఇప్పుడు కేసీఆర్ కు కలిసొచ్చేందుకు సిద్ధంగా లేరు.
ముఖ్యంగా జాతీయ స్ధాయిలో ప్రధాన విపక్షం కాంగ్రెస్ కూడా కేసీఆర్ తో దోస్తీకి సిద్ధంగా లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్దితుల్లో కేసీఆర్ మొదలుపెట్టిన పోరాటం చూస్తుంటే ఆయన స్వంత పార్టీ టీఆర్ఎస్ నేతలకు కూడా నమ్మశక్యంగా అనిపించడం లేదు. దీనికి కారణం చంద్రబాబు అనుభవాల్ని కేసీఆర్ పూర్తిగా విస్మరిస్తుండటమే.

కేసీఆర్ తీరుపై అనుమానాలు?
తెలంగాణలో తనకు గట్టి పోటీ ఇస్తుూ రోజురోజుకూ బలపడుతున్న బీజేపీని నిలువరించేందుకు కేసీఆర్ జాతీయ స్ధాయిలో ఆ పార్టీని ఇరుకునపెట్టే పోరును ఎంచుకున్నారు. కానీ జాతీయ స్ధాయిలో కేసీఆర్ పోరాడినా పోరాడకపోయినా రాష్ట్రంలో బీజేపీని నిలువరించడం మాత్రం అసాధ్యంగానే కనిపిస్తోంది.
ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందడం లేదన్న కారణంతో బీజేపీని వ్యతిరేకించడం వరకూ కరెక్టే అయినా జాతీయ స్ధాయిలో ఆ పార్టీపై పోరాడాల్సిన అవసరం టీఆర్ఎస్ కు లేదు.అయినా కేసీఆర్ మాత్రం వరుసగా పొరుగు రాష్ట్రాల్లో తిరుగుతూ తెలంగాణపై దృష్టిపెట్టడం మానేస్తున్నారు.
దీని వల్ల బీజేపీకి జాతీయ స్ధాయిలో జరిగే నష్టం కంటే తెలంగాణలో టీఆర్ఎస్ కు జరిగే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. అయినా కేసీఆర్ లెక్కచేయకుండా జాతీయస్ధాయిలో పోరాటం చేస్తున్నారంటే ఆయనపై సగటు ఓటర్లలోనూ అనుమానాలు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications