శీతాకాల విడిది: హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి, కేసీఆర్ పాదాభివందనం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన శీతాకాల విడిది కోసం గురువారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు.
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన శీతాకాల విడిది కోసం గురువారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
హకీంపేట ఎయిర్ పోర్టులో స్వాగతం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సీఎం కేసీఆర్ పాదాభివందనం చేశారు. అనంతరం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరారు. ఈనెల 31 వరకు ఇక్కడే బస చేయనున్న ప్రణబ్ ముఖర్జీ తన కార్యకలాపాలను ఇక్కడి నుంచే కొనసాగిస్తారు.

23న ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్స్ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అదే రోజున మధ్యాహ్నం హెచ్ఐసీసీలో ఫ్యాప్సీ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో, 24న మహిళా దక్షత సమితి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
25న బెంగళూరులో జరిగే 89వ భారత్ బంగా సాహిత్య సమ్మేళనంలో, 26న మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 27న మైసూరులో జరిగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ సమ్మేళనంలో పాల్గొనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ఆయన గౌరవార్ధం రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు. 30న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, విఐపిలకు విందు ఉంటుంది. 31వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయలుదేరతారు.












Click it and Unblock the Notifications