చాకలి ఐలమ్మ స్పూర్తితోనే.. బంగారు తెలంగాణ: హరీష్ రావు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందాం అని తెలిపారు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న మంత్రి హరీష్ రావు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ రహదారులపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి సైతం ఆయన హాజరుకానున్నారు.
గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు అన్ని వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి అని ఆయన తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ ఉక్కు మహిళ అని, ఆమె అందరికీ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఐలమ్మ స్పూర్తితోనే ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పిన మంత్రి హరీష్ రావు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ పోరాట యోధులను గౌరవించుకునే సంస్కృతి, సాంప్రదాయం మనకు ఉందని పేర్కొన్న మంత్రి హరీష్ రావు చాకలి ఐలమ్మ చూపిన మార్గంలో ముందుకు సాగాలని రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చాలని కోరారు.
అంతేకాదు కోటి రూపాయలతో ఐలమ్మ భవనాన్ని నిర్మించుకున్నామని, మరో పదిహేను రోజుల్లో అన్ని వసతులను సమకూర్చుకునే విధంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల కోసం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పిన మంత్రి హరీష్ రావు ప్రజలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. అంతేకాదు ప్రజలు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని , తమ వృత్తిని కొనసాగించడానికి డ్రై క్లీనర్స్ డ్రైయ్యర్స్ వంటి వాటిని ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు. వీటిలో ఏర్పాటుచేసిన విధంగా గజ్వేల్ లో కూడా మోడల్ దోభీ ఏర్పాటు చేస్తామని చెప్పిన మంత్రి హరీష్ రావు అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.