చేతబడి చేస్తోందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు
కామారెడ్డి: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలాన్) గ్రామంలో చేతబడి చేసిందనే అనుమానంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. చిల్లల అఖిల(15) అనే బాలికను అదే గ్రామానికి చెందిన వడ్ల లింగవ్వ మంగళవారం రాత్రి అపహరించింది. బాలికపై చేతబడి చేయించిందనే అనుమానంతో గ్రామస్థులు లింగవ్వను చెట్టుకు కట్టేసి దాడి చేశారు.
అఖిల మంగళవారం రాత్రి బాత్రూమ్కు వెళ్లగానే, ఇంటి పక్కనే ఉండే లింగవ్వ, మాయ మాటలు చెప్పి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి తీసుకెళ్లి చేతబడి చేయించిందని గ్రామస్థులు ఆరోపించారు. తల్లిదండ్రులు బాలిక కోసం గ్రామంలో రాత్రి వెతికినా దొరకలేదు.
బుధవారం ఉదయం 4 గంటల సమయంలో బాలిక ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తెలిపింది. గ్రామస్థులంతా లింగవ్వను పంచాయతీ ముందు కట్టేసి దాడి చేశారు. ఆమెతో పాటు అదే గ్రామానికి చెందిన వడ్ల సుదర్శన్, వడ్ల లింగవ్వ, నాగభూషణం, గాండ్ల సాయిలుపై దాడి చేసి కొట్టారు. సమయానికి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని విడిపించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులను పిట్లం పోలీస్స్టేషన్కు తరలించారు.
సీఐ రమణారెడ్డి ఘటనా స్థలానికి చేరకుని పరిస్థితిని సమీక్షించారు. చేతబడి చేశారని కొట్టడం నేరమని హెచ్చరించారు. గ్రామస్థులు సంయమనం పాటించాలని కోరారు. ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారన్నది ఇంకా తెలియరాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ చెప్పారు.