కిలాడీ లేడీ: పెళ్లి కాని కుర్రాళ్లే టార్గెట్, అమ్మాయిల ఫొటోలతో టోకరా
హైదరాబాద్: పెళ్లి కాని కుర్రాళ్లను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడిన ఓ మహిళ గుట్టును పోలీసులు రట్టు చేశారు. అబ్బాయిల బలహీనతలను ఆసరా చేసుకుని ఓ మహిళ తన ముఠాతో వారిని అడ్డంగా దోచేసింది. ఈ వ్యవహారంలో చిక్కుకుని మోసపోయిన కుర్రాళ్లు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తులో ఉత్కంఠభరితమైన విషయాలు తెలిశాయి.
హైదరాబాద్ నగరంలో ఓ అందమైన అమ్మాయి ఫొటోతో పత్రికల్లో ప్రకటన ఇచ్చి, కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న ఆమెకు తగిన వరుడు కావాలనీ సమర్థుడైతే చాలనీ కులగోత్రాలు.. ఆస్తిపాస్తులతో పనిలేదని ప్రకటనలో పేర్కొంటారు. దానికి ఆకర్షితులైన యువకులు ఆలోచించకుండా అక్కడ ఉన్న ఫోన్ నంబర్కు డయల్ చేశారు. అట్నుంచి వినిపించే అందమైన కంఠం తాము మ్యారేజ్ బ్యూరో అంటూ సమాధానం ఇస్తుంది.

అలా యువకులకు గాలం వేయడానికి 10 మంది యువతులు మ్యారేజీ బ్యూరో పేరు మీద ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. పెళ్లి సంబంధం కోసం వచ్చిన యువకుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద 5 నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేస్తారు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో కుర్రాళ్లకు వలవేశారు.
ఆ సంబంధం ఖాయం చేసుకోవడానికి యువకులు ప్రతిసారీ ఎంతోకొంత రాబట్టుకునేవారు. కొద్దిరోజులు గడిచాక ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది. మరికొన్ని సందర్భాల్లో తాము ఇతర ప్రాంతంలో ఉన్నట్టు చెప్పేవారు. ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నంబర్లు వీరి వద్దే ఉండటంతో యువకులు పోన్ చేసిన సమయంలో నమ్మించేలా నాటకమాడేవారు.
తన జేబులు ఖాళీ అవుతుండటంతో ధైర్యం చేసిన ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
పత్రికా ప్రకటనల్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాము కూడా బ్రహ్మచారులమనే నమ్మించారు. మోసాన్ని మోసంతోనే బట్టబయలు చేశారు. నకిలీ మ్యారేజ్ రాకెట్ వెనుక సూత్రధారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications