అత్త నీచపు చర్య: తన భర్తకు బిడ్డను కనాలని కోడలిపై లైంగిక వేధింపులు..
ఆమె రెండో భర్తకు బిడ్డను కనిపెట్టాలని తనను వేధించినట్లుగా సుమానియా ఆవేదన వ్యక్తం చేసింది.
హైదరాబాద్: దేశంలో 'ట్రిపుల్ తలాక్' పై ఓవైపు వాడి వేడి చర్చ నడుస్తుండగానే.. దాని బారిన పడి జీవితాలు నాశనమైనపోయిన మహిళలు సైతం గొంతు విప్పుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ కు చెందిన సుమానియా షర్ఫీ అనే ఓ మహిళ ఇదే విషయంపై స్థానిక పోలీసులను ఆశ్రయించింది.
2015లో తనకు వివాహమైందని, అయితే నెల తిరగకుండానే తనకు వేధింపులు మొదలయ్యాయని సుమానియా తెలిపింది. దుబాయ్ లో ఓ నెల రోజులు ఉండి వచ్చిన తర్వాత తనకు ఈ కష్టాలు మొదలయ్యాయని చెప్పుకొచ్చింది. భర్త, అత్త ఇద్దరూ కలిసి తనను వేధించిన వైనాన్ని వివరించింది.
భర్తకు గార్డియన్ గా వ్యవహరిస్తూ.. తనకు అత్తగా ఉన్న మహిళ ఎంత నీచానికి దిగజారిందో వివరించింది. ఆమె రెండో భర్తకు బిడ్డను కనిపెట్టాలని తనను వేధించినట్లుగా సుమానియా ఆవేదన వ్యక్తం చేసింది.అత్త చేసిన ఈ పనికి భర్త కూడా మద్దతునిచ్చాడని పేర్కొంది. ఒక దశలో గదిలో బంధించి తనను లైంగికంగా వేధించారని వాపోయింది. అటు తర్వాత వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకోవడానికి ప్రయత్నించినట్లుగా వెల్లడించింది.
సుమానియా ఫిర్యాదు మేరకు ఆమె భర్త ఓవైసీ తాలిబ్పై ఐపీసీ సెక్షన్ 420, 406, 506 ఆర్/డబ్ల్యూల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.