50వేల మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్: నిక్కీ జోసెఫ్ పూర్వాపరాలు, కస్టడీకి కోర్టు అనుమతి
హైదరాబాద్: సామాజిక మాద్యమాలతో యువతలో ఉగ్రవాద భావజాలం ప్రేరేపిస్తూ, పోలీసులకు పట్టుబడిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరురాలు నిక్కిజోసెఫ్ అలియాస్ అఫ్సాజుబీన్ను రాజేందర్నగర్ కోర్టు పది రోజులపాటు పోలీసు కస్టడీకి ఇచ్చింది.
అఫ్సా జుబేన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించే క్రమంలో తాను ఐదుగురితో ఫేస్బుక్ సంభాషణలు నెరపినట్టు పోలీసులకు కీలక సమాచారమిచ్చింది. దీంతో నిక్కిజోసెఫ్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సైబరాబాద్ పోలీసులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ మేరకు మంగళవారం రాజేందర్నగర్ కోర్టు నిక్కిజోసెఫ్ను 10రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాద భావజాలం వ్యాప్తితో భారత్లోని యువతతోపాటు ఇతర దేశాలకు చెందిన సుమారు 50వేల మందికి ఫేస్బుక్ ద్వారా వీడియో క్లిప్పింగ్స్ పంపుతూ ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంపై పోలీసులు విచారణ జరపనున్నారు.
ఇదంతా జాతీయ, అంతర్జాతీయ అంశాలతో కూడుకుంది కాబట్టి నిక్కిజోసెఫ్ను సైబరాబాద్ పోలీసుల విచారణ అనంతరం ఎన్ఐఏ కూడా కోర్టు అనుమతితో ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, నిక్కిజోసెఫ్ పోలీసు కస్టడీకి ఇచ్చే నేపథ్యంలో తన నేరాంగీకార పత్రంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
నిక్కీ జోసెఫ్ నేపథ్యం
హైదరాబాద్ నగరంలోని టోలిచౌకీ ప్రాంతానికి చెందిన అబుస్ సల్మాన్, రాహత్ దంపతులకు 1977లో జన్మించింది అఫ్సా జుబేన్. 1980లో వ్యాపారరీత్యా వారు ఆబుదాబి (సౌదీ)కి వెళ్లారు. డ్రీమ్ ల్యాండ్ స్టేషనరీ, ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించారు. కాగా, 1996లో అఫ్సాజుబేన్ తిరిగి నగరానికి వచ్చి ఖైరతాబాద్లోని షాదాన్ కళాశాలలో డిగ్రీ కామర్స్ పూర్తి చేసింది.
ఈ క్రమంలో దేవేందర్కుమార్ బత్రాను ఇస్లాం మతంలోకి మార్చుకుని పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. కాగా, దుబాయ్లో ఆమె గృహిణిగా ఉంటున్నందున తరచూ వెబ్సైట్లు, ఫేస్బుక్లను చూస్తూ సిరియా యుద్ధ దృశ్యాలు చూస్తూ.. మత పెద్దలు జకీర్ నాయక్, మహమ్మద్ అహ్మద్ వంటి వారి ఇస్లాం మత ప్రసంగాలకు ఆకర్షితురాలైంది.
సున్నీ, షరియత్ చట్టాల కోసం ఐఎస్ పోరాడటానికి ఆకర్షితురాలై ఫేస్బుక్లో ఖాతా తెరచి యువతను ఐఎస్ భావాజాలం వైపు మళ్లించ సాగింది. ఈ క్రమంలోనే మోహియుద్దిన్తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడి భారత్ కాఫర్ల రాజ్యమని, భారత్ను ఖలీఫా రాజ్యంగా మార్చాలని ప్రచారం ప్రారంభించింది.
అదే క్రమంలో మోహియుద్దీన్ ఈ ఏడాది జనవరి 16న దుబాయి నుంచి హైదరాబాద్కు వస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం అందిన వెంటనే అఫ్సాజుబేన్ తన ఫేస్బుక్, సామాజిక మాద్యమాల ఖాతాలను మూసేసింది. అయినప్పటికీ పోలీసులు ఆమె ఫేస్బుక్ ఆధారంగా సెప్టెంబర్ 11న నగరానికి వస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్డులో ఆరెస్టు చేసి సెప్టెంబర్ 23వరకు రిమాండ్కు తరలించారు.