జూబ్లీహిల్స్లో భర్తను చంపిన భార్య: ఇంట్లో నుంచి పారిపోయిన వ్యక్తి
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని ఓకాలనీలో జగన్ అనే వ్యక్తిని భార్య దారుణంగా హతమార్చింది. ఇందుకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించింది.
గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బానోతు జగన్, దేవికలు భార్యాభర్తలు. రెండు నెలల క్రితం ఫిలింనగర్ వచ్చారు. సైదప్ప బస్తీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగన్ ఓ ప్రయివేటు ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. సోమవారం సెలవు కావడంతో జగన్ ఇంట్లో కూర్చొని మద్యం సేవించాడు. అదే పనిగా మందు తాగాడు.
దీనిపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ విషయమై కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి కూడా ఇద్దరు గొడవపడ్డారు. ఆ తర్వాత బొద్దింకలను చంపే హిట్ మందును మద్యంలో కలిపి భార్యకు తాగించే ప్రయత్నం చేశాడు. ఆమె తాగలేదు.
ఆ కోపంలో జగన్ హిట్ మందు కలిపిన మందు తానే తాగేశాడు. ఆ తర్వాత బీరు సీసా పగులగొట్టి పొడవబోయాడు. ఆమె ప్రతిఘటించింది. హిట్ కళ్లలో కొట్టబోగా బలంగా తన్నింది. కుప్పకూలిన భర్తపై కూర్చొని గొంతు నులిమింది. జగన్ ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో నుంచి అరుపులు, కేకలు రావడంతో ఇంటి యజమాని వచ్చి చూశాడు.
అప్పటికే జగన్ చనిపోయాడు. జగన్ భార్య ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందనే విషయంపై యజమాని ఆరా తీయగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో ఓ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోవడాన్ని గమనించిన స్థానికులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అతను తప్పించుకున్నాడు. పోలీసులు దేవికను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.