ప్రేయసి ఇంటికి వెళ్లబోయి..: రేప్ చేయడానికి వచ్చాడని ఉరేసి గేటుకు వేలాడదీశారు
హైదరాబాద్: తాగిన మత్తులో జరిగిన పోరపాటుకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మద్యం సేవించిన మత్తులో ప్రియురాలి ఇంటికి బదులు మరో స్త్రీ ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తిండంతో ఓ ఆటోడ్రైవర్ ప్రాణాలను పోగట్టుకున్నాడు.
హైదరాబాద్ నార్త్జోన్ పోలీసులు దర్యాప్తు చేసిన ఈ మిస్టరీ కేసులో ఐదుగురు నిందితులు పట్టుపడ్డారు. ఈ నెల 4న చిలకలగూడ పోలీసులకు పద్మరావునగర్ అభినవ్నగర్ భవానీ నిలయం వద్ద ఓ వ్యక్తి గాయాలతో మృతి చెంది ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే, మృతుడు ఆటోడ్రైవర్ మహ్మద్ షఫీ. 3వ తేదీన షఫీ స్నేహితులు రాజ్పాల్ సింగ్, రాజుతో కలిసి పార్శిగుట్ట ఎంఎన్ఆర్ బార్లో మద్యం సేవించాడు. తర్వాత షఫీ మొరంనగర్లో ఉన్న అతడి ప్రియురాలు జరీనా ఇంటికి వెళ్దామని రాజ్పాల్సింగ్కు చెప్పాడు. దీంతో షఫీని రాజ్పాల్సింగ్ మొరంనగర్లో వదిలేసి వెళ్లిపోయాడు.
మద్యం మత్తులో ఉన్న షఫీ జరీనా గుడిసెలోకి వెళ్లకుండా భవానీ అనే మహిళ గుడిసెలోకి వెళ్లాడు. ఆమె గట్టిగా అరవడంతో బయట నిద్రిస్తున్న భర్త అన్నవరం వచ్చి షఫీని పట్టుకుని చుట్టుపక్క వారిని అప్రమత్తం చేశాడు. అన్నవరంతో పాటు భవానీ, పక్క గుడిసెలో ఉంటున్న జరీనా భర్త మహ్మద్ అన్వర్, బావ నజీర్, సోదరుడు షరీఫ్ కలిసి షఫీని రాడ్లు, కర్రలతో చితకబాది, మెడకు ఉరి వేసి గేటుకు వేలాడదీశారు.
అతడు మృతి చెందాడని భావించి, గుట్టు చప్పుడు కాకుండా రిక్షాలో తరలించి శవాన్ని భవాని నిలయం వద్ద పడేశారు. ఇలా వీరు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడినప్పటికీ పోలీసులు దర్యాప్తులో నిజాన్ని తేల్చి ఐదుగురిని ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల్లో మహిళ, ఓ మైనర్ బాలుడు, మరో ముగ్గురు ఉన్నారు.