అత్తపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కోడలు, చెట్లపొదల్లో మహిళ మృతదేహం
హైదరాబాద్: మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నంగనూరు మండలం వెల్కటూర్లో అత్తపై కిరోసిన్ పోసి కోడలు నిప్పంటించింది. ఈ ఘటనలో పూర్తిగా కాలిపోయి అత్త మృతి చెందింది. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మహిళ అనుమానాస్పద మృతి
ఆదిలాబాద్ జిల్లాలోని రామకృష్ణాపురం పట్టణంలోని శిశుమందిర్ స్కూల్ పక్కనున్న చెట్లపొదల్లో శుక్రవారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతి చెందిన మహిళను రామకృష్ణాపురానికి చెందిన సుద్దాల శైలజ (24)గా గుర్తించారు.
మృతదేహాంపై రక్తపు మరకలు ఉండటంతో బాగా దెబ్బలు కొట్టడం వల్లే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
భద్రాచలంలో ఆకతాయికి దేహశుద్ధి
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం సీతారమ్నగర్లో ఓ ఆకతాయికి స్థానికులు దేహశుద్ధి చేశారు. బాలరాజు అనే వ్యక్తి కొన్ని రోజులుగా ఫేస్బుక్లో అమ్మాయిలకు అసభ్య చిత్రాలను పోస్టు చేస్తూ, దుర్భాషలాడుతున్నాడు. వేరువేరు పేర్లతో ఫేస్బుక్లో బాలరాజు అకౌంట్లు ఓపెన్ చేసి ఆకతాయి పనులు చేస్తున్నాడు.
ఇది గమనించిన బాధితులు బాలరాజు ఇంటిపై దాడి చేశారు. ఇంటిలోని ఫర్నిచర్ ధ్వసం చేశారు. ఈ దాడిలో బాలరాజు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మహబూబ్నగర్లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
మహబూబ్నగర్ జిల్లాలోని ఇటిక్యాల మండలం వేముల దగ్గర హైవేపై ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.