జోరు వాన: కుమారుడి శవంతో రాత్రంతా రోడ్డు మీదే తల్లి రోదన
మానవత్వం మంట గలిసిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. కుమారుడు మరణించాడనే బాధతో ఓ తల్లి చేసిన రోదన హృదయాలు కలిచి వేసింది.
Recommended Video

హైదరాబాద్: మానవత్వం మంట గలిసిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. కుమారుడు మరణించాడనే బాధతో ఓ తల్లి చేసిన రోదన హృదయాలు కలిచి వేసింది. అయితే, ఇంటి యజమాని గుండె మాత్రం కరగలేదు. ఆ యజమాని తీరు తల్లి గుండెను మరింత కోత పెట్టింది
మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి యజమాని ఇష్టపడలేదు. మృతదేహాన్ని ఇంట్లోకి తెస్తుంటే అడ్డుకున్నాడు. దాంతో ఆమె రాత్రంతా జోరువానలో తడుస్తూ జాగారం చేసింది. ఈ దారుణమైన విషాద ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి సర్కిల్ వెంకటేశ్వరనగర్లో జరిగింది.
వనపర్తి జిల్లా పాన్గల్ ప్రాంతానికి చెందిన దాసర్ల ఆంజనేయులు, ఈశ్వరమ్మ దంపతులకు కూతురు చందన(13), కుమారులు సురేశ్(11), దేవకుమార్(9) ఉన్నారు. దేవకుమార్ సరిగా మాట్లాడలేడు. ఐదేళ్ల కిందట ఉపాధికోసం వీరు వెంకటేశ్వరనగర్కు వచ్చి కూలి పనిచేస్తున్నారు.

భర్త వెళ్లిపోయాడు...
రెండేళ్ల కిందట ఈశ్వరమ్మతో ఆంజనేయులు గొడవ పెట్టుకొని కూతురుతో గ్రామానికి వెళ్లిపోయాడు, ఈశ్వరమ్మ ఇళ్లలో పాచిపని చేస్తూ కొడుకులను సాకుతోంది. రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్న సురేశ్కు బుధవారం సమస్య తీవ్రమైంది. దీంతో స్థానిక సెవెన్స్టార్ మెడికల్ సెంటర్లో చూపించగా డెంగ్యూగా నిర్ధారించారు. అక్కడి నుంచి కేపీహెచ్బీకాలనీలోని ప్రసాద్ వైద్యశాలకు తీసుకెళ్లింది. వైద్యానికి రూ.రెండు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. డబ్బులు లేవని ఈశ్వరమ్మ చెప్పడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహాఇచ్చారు. నిలోఫర్లో చేర్పించినప్పటికీ ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోయి బుధవారం సాయంత్రం ఆరుగంటలకు కొడుకు కన్నుమూశాడు.

మృతదేహాన్ని తీసుకుని వస్తే...
మృతదేహాన్ని అంబులెన్స్లో వెంకటేశ్వరనగర్కు తీసుకెళ్లగా, ఇంట్లోకి రానివ్వకుండా ఈశ్వరమ్మను యజమాని జగదీశ్వరయ్య, అతని కుమారుడు వెంకటేశ్ అడ్డుకున్నారు. తన కూతురు వివాహమై ఆరునెలలు కూడా కాలేదని, ఇంట్లోకి మృతదేహాన్ని తీసుకురానివ్వనని జగదీశ్వరయ్య చెప్పాడు. స్థానికులు ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

యజమాని ప్రవర్తనతో..
యజమాని ప్రవర్తనతో మృతదేహంతో రోడ్డు పక్కనే భారీవర్షంలో తడుస్తూ కూర్చున్న ఈశ్వరమ్మను చూసిన స్థానికులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మృతదేహాన్ని ఉంచేందుకు ఫ్రీజర్ తెప్పించారు. రాత్రంతా మృతదేహంతో వర్షంలో ఈశ్వరమ్మ ఒంటరిగా జాగారం చేసింది. గురువారం స్థానికులు చందాలు వేసుకొని సుమారు రూ.45 వేలు సేకరించి ఆమెకు అందజేశారు. సురేశ్ చదువుతున్న వెంకటేశ్వరనగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్కూల్ తరఫున రూ.10 వేలు ఇచ్చారు.

టీవీ చానెళ్లలో రావడంతో...
సురేశ్ మృతదేహాన్ని చూసి, అతని పక్కనే కూర్చునే విద్యార్థి సాయి కంటతడిపెట్టిన తీరు గుండెలను పిండేసింది. ఈ విషయం టీవీ చానళ్లలో రావడంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చి యజమానిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సురేశ్ అంత్యక్రియలకు సహకరించాలని యజమానికి జగద్గిరిగుట్ట పోలీసులు సూచించారు. స్థానికుల సాయంతో హెచ్ఎంటీలోని గుబురుగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిపించారు.












Click it and Unblock the Notifications