పేదరికం: రూ. 200లకే అమ్మకానికి పసికందు
మహబూబ్నగర్: పేదరికం కారణంగా ఓ తల్లి తన కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది. పేగుబంధాన్ని తెంచుకుని మూడు నెలల పసికందును రూ.200లకు అమ్మేయడానికి ఓ తల్లి సిద్ధపడింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు శిశువును స్వాధీనం చేసుకుని, శిశువిహార్కు తరలించారు.
మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన షాహీదాబేగంకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. నాలుగో సంతానంగా మూడు నెలల కిందట మళ్లీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏడాది కిందట భర్త చనిపోవడంతో పోషణ భారమై ముగ్గురు పిల్లలను తన సోదరికి అప్పగించింది.

నాల్గో సంతానంగా జన్మించిన మూడు నెలల శిశువు పోషణను భారంగా నెట్టుకొస్తున్న షాహీదాబేగానికి మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో ఆదివారం వంగూరు గేట్ వద్ద శిశువును రూ.200లకు విక్రయిస్తుందని సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.శ్రీమతమ్మ అక్కడికి చేరుకుంది.
శిశువును, తల్లిని కల్వకుర్తికి తీసుకొచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు.
కూతురును తాను పోషించలేనని అంగీకరించిన షాహీదా ఐసీడీఎస్ అధికారులకు అప్పగించింది. శిశువును శిశువిహార్కు తరలించినట్లు సూపర్వైజర్ శ్రీమతమ్మ చెప్పారు. సూపర్వైజర్ వెంట అంగన్వాడీ కార్యకర్తలు నిర్మల, లక్ష్మమ్మ, ఆయా అలివేలు ఉన్నారు.












Click it and Unblock the Notifications