ప్రేమిస్తున్నానని చెప్పి యువతిపై రేప్: లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ పేరుతో వెంట తిప్పుకొని పెళ్లికి నిరాకరించటమే కాకుండా చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ ఓ యువతి ఓ యువకుడిపై హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని, ప్రేమ పేరుతో మోసం చేసి బెదిరిస్తున్నాడని ఆమె తెలిపింది.
నల్లగొండ జిల్లాకు చెందిన యువతికి 2007లో బీఫార్మసీ కోర్సు చేసే సమయంలో సీనియర్ విద్యార్థి సభావత వెంకటేశ్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడ్డాడు. అతడి మాటలు నమ్మి ప్రేమించింది. ఇద్దరూ కలిసి తిరిగారు. ఉన్నత చదువుల కోసం 2012లో లండన్ వెళ్లాడు.
అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాక రించాడు. ప్రస్తుతం నగరంలో ఉంటున్న వెంకటేశ్ మాట్లాడుదామని పిలిచి తన మెడకు చున్నీ బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, లైంగిక వేధింపులు తాళలేక గిరిజన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం రాళ్ళ చెరువు తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన రాత్లావత్ ప్రియాంక హైదరాబాద్లోని సంతోష్ నగర్లో డిగ్రీ చదువుతోంది.
అయితే అదే గ్రామానికి చెందిన గణేష్, మహేష్ తో పాటు మరో ఇద్దరు ఆకతాయిలు తనను లైంగికంగా వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాసి, ఉరేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో తిమ్మాజిపేట పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.