రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాడు, యువతుల అశ్లీల డ్యాన్స్తో ఇబ్బందిపడ్డారు
వరంగల్/హైదరాబాద్: టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. టిక్కెట్ కలెక్టర్ రావడంతో రన్నింగ్ రైలు నుంచి దూకి, ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన గురువారం జరిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా కేసముద్రం వద్ద చోటు చేసుకుంది.
రమేష్ అనే యువకుడు టిక్కెట్ కొనకుండా రైలు ఎక్కాడు. టికెట్ కలెక్టర్ చెకింగ్ చేసేందుకు వస్తుండటంతో గమనించిన అతను దిక్కుతోచక వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆ యువకుడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ రైలులో ఈ సంఘటన జరిగింది. రమేష్ను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిఎంకు తరలించారు.
ఇద్దరు మహిళల అశ్లీల నృత్యాలు
హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కాలనీలో మహిళలు అశ్లీల నృత్యాలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో నిర్వాహకులు మహిళళతో అశ్లీల డ్యాన్సులు ఏర్పాటు చేశారు. దీని పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తొలుత ఆర్కెస్ట్రాతో ప్రారంభించి.. ఆ తర్వాత అసభ్యకర నృత్యాలకు తెరలేపారు. పెద్ద సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీంతో, స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఇద్దరు యువతులు అశ్లీల నృత్యాలు చేసినట్లుగా తెలుస్తోంది.