హైదరాబాద్ లో గంజాయి మత్తులో యువకుల హల్చల్.. పోలీసుల వాహనంపైకెక్కి వీరంగం!!
తెలంగాణ రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రయత్నాలు చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి దందా జరుగుతుందని తాజా పరిణామాలతో అర్థమవుతుంది. గంజాయిదందా చాప క్రింద నీరులా విస్తరిస్తుంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం లో సోమవారం రాత్రి గంజాయి మత్తులో యువకులు వీరంగం వేసిన సంఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్ లో గంజాయిని సేవించిన యువకులు హల్ చల్ చేశారు. పోలీస్ వాహనంపైకి ఎక్కి పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. మరి కొన్ని వాహనాల పై దాడి చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్ నగర్ లో అర్ధరాత్రి కొందరు యువకులు వీరంగం వేశారు.
ఫుల్ గా గంజాయి సేవించి గంజాయి మత్తులో జిర్రా సమీపంలోని రాయల్ హోటల్ దగ్గర వీరంగం సృష్టించారు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు.గంజాయి సేవించిన యువకుల తీరుతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ముఠా సభ్యులు పోలీసు వాహనం ఎక్కి మరీ నానా హంగామా చేశారు.
పోలీసులు వాహనంతో పాటు ఇతరుల వాహనాల అద్దాలను పగలగొట్టారు. స్థానికుల సహాయంతో పోలీసులు గంజాయి ముఠాను అదుపులోకి తీసుకొని వారికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో కొందరు తప్పించుకోగా పట్టుబడిన వారిని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారికి గంజాయి ఎక్కడి నుండి వచ్చింది అన్న వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. యువకులు గంజాయికి బానిసలుగా మారుతున్న ఘటనలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి.