మీపై నమ్మకంలేదు: ఏపీ పోలీసులకు జగన్ షాక్, స్టేట్మెంట్కు నో, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
Recommended Video

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిటీ న్యూరో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ పోలీసులు ఆయన నుంచి స్టేట్మెంట్ తీసుకోలేకపోయారనితెలుస్తోంది. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన సమయంలో చాలామంది అభిమానులు అక్కడకు తరలి వచ్చారు.
ముఖ్యమంత్రి (చంద్రబాబు) డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఇష్టం లేదని చెప్పారు. జగన్ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏదైనా ఇతర ఏజెన్సీతో కలిసి వస్తే వాంగ్మూలం ఇస్తానని చెప్పారు.

ఐదు రోజుల పాటు విశ్రాంతి
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్కు డాక్టర్లు సూచించారు. దీంతో కొద్ది రోజులు పాదయాత్ర వాయిదా వేసుకోవాలని జగన్కు తల్లి వైయస్ విజయమ్మ సూచించారని తెలుస్తోంది. దీనికి జగన్ పరిస్థితిని బట్టి చూద్దామని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అయితే డాక్టర్ల సూచన మేరకు 5 రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు.

జగన్ ఆరోగ్యంపై డాక్టర్ ఏం చెప్పారంటే?
జగన్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ శివారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి గాయం కారణంగా జగన్ నొప్పితో ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. పెయిన్ కిల్లర్ ఇచ్చామన్నారు. గాయం మానడానికి కొంత సమయం తీసుకుంటుందని చెప్పారు. కండరానికి, చర్మానికి కలిపి ఎనిమిది కుట్లు పడ్డాయన్నారు. రక్తం నమూనాలను ల్యాబ్కు పంపించామని చెప్పారు. డిశ్చార్జ్ అయ్యాక కూడా జగన్ టెస్టులకు రావాల్సి ఉంటుందని చెప్పారు. నార్మల్గానే వచ్చి, గాయం మాని కుట్లు తీసే వరకు విశ్రాంతి తీసుకోవాలన్నారు.

ఏపీ సిట్ బృందానికి జగన్ గట్టి షాక్
వైయస్ జగన్ మధ్యాహ్నం ఒకటి గంటల సమయానికి తన నివాసం లోటస్ పాండుకు చేరుకున్నారు. ఏపీ పోలీసులు, చంద్రబాబు ప్రభుత్వం పని తమకు నమ్మకం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ స్టేట్మెంట్ కోసం విశాఖపట్నం పోలీసులు వచ్చారు. కానీ వారికి జగన్ నో చెప్పారు. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని సిట్ బృందానికి ఆయన సూటిగా చెప్పారని తెలుస్తోంది. తనకు తెలంగాణ పోలీసులు అయితే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినట్లుగా పలు ఛానల్స్లలో వార్తలు వచ్చాయి. (కానీ ఆ తర్వాత వైసీపీ నేతలు ఖండించారు) జగన్ సమాధానంతో షాకైన ఏపీ సిట్ బృందం అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ప్రజా సంకల్ప యాత్రకు వారం విరామం
జగన్ చేయికి గాయం అయిన కారణంగా ఆయన ప్రజా సంకల్ప యాత్ర వారం రోజుల పాటు వాయిదా పడింది. కనసం ఐదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులు కూడా మరిన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. దీంతో జగన్ వారం పాటు పాదయాత్రకు విరామం ఇచ్చారు.

దాడిపై రఘువీరా రెడ్డి
జగన్ పైన దాడి అంశంపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు. ఈ దాడి హేయమైన చర్య అన్నారు. భద్రతా వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగిందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఈ ఘటనపై ట్వీట్ చేశారు. 'వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డి కి కొత్త కాదు. మరో సారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.' అని ఓ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో.. 'తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠం పై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చరం లేదు.ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే' అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications