నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీఇంట్లో 4 ఉద్యోగాలు; సిగ్గుపడాలి: కేసీఆర్ ను ఉతికారేసిన షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిత్యం ఏదో ఒక అంశంపై కేసీఆర్ సర్కారు తీరును ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్న వైఎస్ షర్మిల తాజాగా మరోమారు సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. చేతగాని ముఖ్యమంత్రి మనకొద్దు అంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా కెసిఆర్ తీరుపై మండిపడుతున్న షర్మిల తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై మరోమారు కెసిఆర్ కు చురకలంటించారు.

తెలంగాణా వస్తే ఇంటికో ఉద్యోగం .. మోసం చేసిన కేసీఆర్ సిగ్గు పడాలి
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిగ్గుపడాలని వైయస్ షర్మిల పేర్కొన్నారు. 7 ఏండ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లను రోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసిఐదు, పది చదవని వాళ్లను మంత్రులను చేసినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిగ్గుపడాలి అంటూ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ అవమానంతో తలదించుకోవాలి
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు, నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోనందుకు కేసీఆర్ గారు సిగ్గుపడాలి అంటూ మర్యాదపూర్వకంగానే చీవాట్లు పెట్టారు. అవమానంతో తలదించుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత డిగ్రీలు పీజీలు చదివి హమాలీ పనికి వెళుతున్నారని, ఎనుమాముల మార్కెట్ లో 1500 మంది గ్రాడ్యుయేట్లు జాబ్ నోటిఫికేషన్ లో లేక బస్తాలు మోస్తున్నానని ఒక పేపర్ క్లిప్పింగ్ ని పోస్ట్ చేసి వైయస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వం పై, సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఉద్యోగాలివ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు
చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు వైయస్ షర్మిల. అంతేకాదు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు యొక్క ప్రాధాన్యత ను కూడా తేల్చి చెప్పారు. ఓటుతోనే మార్పు సాధ్యం అని షర్మిల పేర్కొన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటే వజ్రాయుధం అని షర్మిల వెల్లడించారు.అవినీతి, అక్రమాలు అంతం కావాలన్నా.. నియంత, నిరంకుశ పాలన పోవాలన్నా ఓటు హక్కు విధిగా ఉపయోగించుకోవాలి. నిస్వార్థంగా ఓటు వేద్దాం.. మన బతుకులు మార్చుకుందాం అంటూ షర్మిల తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

గోదారి నీళ్లెత్తి మళ్లీ గోదారిలో పారబోయటానికి వేలకోట్ల కరెంటు బిల్లులు.. కాళేశ్వరంపై సెటైర్
అంతేకాదు జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ షర్మిల కమీషన్లకోసం అవసరాని కన్నా 4 ఇంతల ఖర్చు ఎక్కువ పెట్టి గోదారి నీళ్లెత్తి మళ్లీ గోదారిలో పారబోయటానికి వేలకోట్ల కరెంటు బిల్లులు కడుతూ, కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేకున్నా, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలని కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించిన కెసిఆర్ గారికి జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సెటైర్ వేశారు. సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం జరుగుతున్న షర్మిల, సోషల్ మీడియా వేదికగానే సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్నారు. నిత్యం ఏదో ఒక విషయం మీద ఉతికి ఆరేస్తున్నారు.












Click it and Unblock the Notifications