మీ ప్రభుత్వానికి రేపు పాడెకట్టేది, కేసీఆర్ అధికారానికి పాతరేసేది రైతులే: వైఎస్ షర్మిల శాపనార్ధాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కేసీఆర్ సర్కార్ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్టు, కెసిఆర్ ఈ పాపం నాది కాదని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారని రైతుల ప్రాణాలు తీస్తున్న పాపం సీఎం కేసీఆర్ దేనని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

రైతుల ఆత్మహత్యలపై ఆవేదన .. కేసీఆర్ పై వైఎస్ షర్మిల ధ్వజం
తెలంగాణ రైతాంగాన్ని కెసిఆర్ మోసం చేస్తున్నారని ఇప్పటికే అనేక మార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల, తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే . సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల తెలంగాణ రైతాంగ దీన పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి తెలంగాణా సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. తాజాగా మరోమారు మరో రైతు ఆత్మహత్యపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నం పెట్టే రైతు చావు కేకలను వినే దిక్కులేదని ఆవేదన
బంగారు తెలంగాణలో అన్నం పెట్టే రైతు చావు కేకలను వినే దిక్కులేదని ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఈ రోజు పంట పాడైతే నష్టపరిహారం అందించే దిక్కులేక,పెట్టిన పెట్టుబడి రాక, ఆదుకోవాల్సిన సర్కార్ రైతు చావులను సర్కస్ లా చూస్తుందని మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను నమ్మలేక లేక,చేసేది లేక పురుగుల మందునే నమ్ముకొని ఆత్మహత్యలు చేసుకొంటున్నారు రైతులు అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు షర్మిల. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణమని మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ని రైతులు నమ్మలేకపోతున్నారు అంటూ పేర్కొన్నారు.
వందల మంది రైతుల చావులకు కారణమైన మీ పాపం ఊరికే పోదు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టేకుమట్ల మండలం లో ఒక మిర్చి రైతు అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అలాగే యాదాద్రి జిల్లాలో మరో పత్తి రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని 2 పేపర్ క్లిప్పింగ్స్ ను పోస్ట్ చేసిన వైయస్ షర్మిల రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని దుయ్యబట్టారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు, కేసీఆర్ గారు ఈ పాపం నాది కాదని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు వైయస్ షర్మిల. వందల మంది రైతుల చావులకు కారణమైన మీ పాపం ఊరికే పోదు అని మండిపడ్డారు. రైతు హంతకులు మీరు అని పేర్కొన్న షర్మిల రైతును కాటికి పంపుతున్న మీ ప్రభుత్వానికి రేపు పాడె కట్టేది, మీ అధికారానికి పాతరేసేది రైతులే అని తేల్చి చెప్పారు.

గతంలోనూ రైతుల మరణాలపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల
ఇంతకు ముందు కూడా షర్మిల రైతుల ఆత్మహత్యలపై తెలంగాణా సర్కార్ ను టార్గెట్ చేశారు. వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని ఎప్పుడు కొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతుంటే, యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమర్శించారు. మీ డ్రామాలకు ఇప్పటికే ఎందరో రైతుల గుండెలు ఆగిపోయాయని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు వైయస్ షర్మిల. ఇంకెంత మంది రైతులు చస్తే మీ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ గారు అంటూ సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఇంకెంత మంది తెలంగాణ రైతులను బలితీసుకుంటారో సీఎం కేసీఆర్ చెప్పాలంటూ నిలదీశారు.












Click it and Unblock the Notifications