ఆస్పత్రి నుండి వైఎస్ షర్మిల డిశ్చార్జ్: డాక్టర్స్ సలహా ఇదే.. వాట్ నెక్స్ట్!!
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల నేడు అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగించడానికి తనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే.
కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా వైయస్ షర్మిల దీక్ష చేస్తున్న క్రమంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. వైయస్ షర్మిల ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆదివారం నాడు అక్కడ వైయస్ షర్మిల చికిత్స పొందారు. ఆస్పత్రిలో బెడ్ పై నుండే వైయస్ షర్మిల కెసిఆర్ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని నిర్బంధాలు సృష్టించిన పోరాటం చేసి తీరుతానని స్పష్టం చేశారు.
కనీసం నీళ్ళు కూడా తాగకుండా ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల వైయస్ షర్మిల లో బీపీ, బలహీనత కారణంగా అస్వస్థతకు గురయ్యారు.

దీంతో ఆమెకు ఆసుపత్రిలో వైద్య సేవలు అందగా ఇక తాజాగా ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి లోటస్ పాండ్ కు చేరుకున్నారు. అయితే వైయస్ షర్మిల బలహీనంగా ఉన్నారని, ఆమెకు పదిహేను రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు ఆమెకు సూచించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల పాదయాత్రలు చేసి తీరుతా అని స్పష్టం చేస్తున్నారు. గౌరవ హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా.. కెసిఆర్ మాత్రం పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేశారని మండిపడ్డారు.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను, మా కార్యకర్తలను బందీలను చేశారని విమర్శించారు. తమ నాయకులను తీవ్రంగా కొట్టారని, అకారణంగా కర్ఫ్యూ విధించారని మండిపడ్డారు. ఇవన్నీ వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారు. మీ త్యాగాలను వైయస్సార్ బిడ్డ ఎన్నటికీ మరవదన్నారు . వైయస్సార్ పై మీకున్న అభిమానాన్ని మరొక్కసారి నిరూపించుకున్నారని పేర్కొన్న షర్మిల, వైయస్సార్ బిడ్డను పంజరంలో పెట్టి బంధించాలనుకోవడం కెసిఆర్ తరం కాదని స్పష్టం చేశారు. ఇక ఈ క్రమంలో తాజాగా డిశ్చార్జ్ అయిన వైయస్ షర్మిల మళ్లీ ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications