కోహినూర్ వజ్రంలాంటి పాలమూరు: లంబాడీ వస్త్రధారణలో వైఎస్ షర్మిల: చంద్రబాబుపై సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి సమాయాత్తమౌతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. మలి విడత ఆత్మీయ సమావేశాలను ఆరంభించారు. ఇదివరకు ఉమ్మడి నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, విద్యార్థులతో భేటీలను నిర్వహించారు. తాజాగా ఆమె మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అభిమానులతో సమావేశం అయ్యారు. బంజారాహిల్స్ లోటస్పాండ్ నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది.
వైఎస్ జగన్కు ఎన్డీఏ పెద్దల నుంచి పిలుపు: రేపు ఢిల్లీకి ప్రయాణం?: ఆ విషయంపై క్లారిటీ
600 మందికి పైగా
ఈ సమావేశానికి మహబూబ్నగర్ జిల్లా నుంచి 600 మందికి పైగా హాజరయ్యారు. కొంతమంది లంబాడీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు.. షర్మిలకు తమ సంప్రదాయ దుస్తులను బహుమానంగా అందజేశారు. వారితో ఆమె కొద్దిసేపు మాట్లాడారు. ఆప్యాయంగా పలకరించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ నియోజకవర్గం నుంచి వచ్చారని అడగ్గా మక్తల్, కల్వకుర్తి, కొడంగల్ నుంచి వచ్చినట్లు చెప్పారు. అనంతరం వారితో కలిసి మీటింగ్ హాల్కు వెళ్లారు.
80 శాతం ప్రాజెక్టులు నాన్నగారి హయాంలోనే..
ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి తన తండ్రి వైఎస్సార్ ఎంతో కృషి చేశారని షర్మిల అన్నారు. 80 శాతం నీటి ప్రాజెక్టులు ఆయన హయాంలోనే పూర్తయ్యాయని చెప్పారు. కోహినూర్ వజ్రం లభించిన పాలమూరు.. వలస జిల్లాగా గుర్తింపు పొందడం బాధాకరమని చెప్పారు. మహబూబ్నగర్ను ఆదుకోవడానికి వైఎస్సార్కు ముందు పరిపాలించన ముఖ్యమంత్రులు ఎలాంటి సమగ్ర, నిర్మాణాత్మక చర్యలను తీసుకోలేకపోయారని అన్నారు. ఓ ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నప్పటికీ.. చిత్తశుద్ధితో అభివృద్ధి చేసే ప్రయత్నం చేయలేదని, ఫలితంగా జిల్లా తలరాత మారలేదని చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రాజన్న సువర్ణ యుగం..
తెలంగాణలో రాజన్న సువర్ణ యుగాన్ని తీసుకుని రావడమే తన లక్ష్యమని షర్మిల తేల్చి చెప్పారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలనేదే తన కోరిక అని చెప్పారు. ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి తాను ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో వలసలను చూసి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చలించి పోయారని, జలయజ్ఞం కింద ప్రాజెక్టులను పూర్తి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం మహబూబ్ నగర్ జిల్లాలో క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను సూచించాని విజ్ఙప్తి చేశారు.
వచ్చేనెల 9న ఖమ్మంలో నిర్వహించే సభపై
వైఎస్ షర్మిల నెలకొల్పబోయే పార్టీ పేరు- వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ప్రచారంలో ఉంది. ఆత్మీయ సమావేశాలను ప్రారంభించిన తొలి గంటలోనే ఈ పేరు ప్రచారంలోకి వచ్చింది. విస్తృతంగా జనంలోకి వెళ్లింది. తమ పార్టీ పేరు ఇదేనంటూ షర్మిల గానీ, సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి గానీ ఎక్కడా ప్రకటించలేదు. తాజాగా- ఈ పేరును మార్చాలని షర్మిల భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె పరిశీలనలో రెండు కొత్త పేర్లు ఉన్నాయని అంటున్నారు. వైఎస్ఆర్టీపీ లేదా రాజన్న రాజ్యం అనే పేర్లను ఆమె పరిశీలిస్తోన్నారని సమాచారం. అభిమానుల సూచనల మేరకే పార్టీ పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది.