లోటస్పాండ్లో షర్మిల ఆమరణ దీక్ష, విజయమ్మ మద్దతు: వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ప్రజా ప్రస్థాన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. తొలుత హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి దీక్షకు కూర్చున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న సైఫాబాద్ పోలీసులు ఆమె నివాసం లోటస్పాండ్కు తరలించారు.
ఆ తర్వాత లోటస్ పాండ్ వద్ద రహదారిపైనే దీక్షకు దిగిన షర్మిలను పోలీసులు బలవంతంగా ఆమె ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, షర్మిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఇంటి ఆవరణలోనే నిరవధిక దీక్షకు దిగారు షర్మిల. ఆమెకు మద్దతుగా తల్లి విజయమ్మ కూడా దీక్షలో కూర్చున్నారు.
ప్రజా సమస్యలపై పోరాడుతున్నందునే కేసీఆర్ సర్కారు తన పాదయాత్రను అడ్డుకుంటోందని మండిపడ్డారు షర్మిల. తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే అంటకాగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ, బండి సంజయ్ పాదయాత్రలకు అనుమతిచ్చిన కేసీఆర్ సర్కారు.. తమ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి చేయలేని కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీతో ఏం సాధిస్తారని నిలదీశారు.
KCR is trying his best to stop my padyatra. My bus was burnt, my people were beaten up & they accused me for violence. Later they arrested me & took me to Hyderabad. Next day Court granted permission to do Padyatra but Police isn't allowing us: Telangana YSRTP Chief YS Sharmila pic.twitter.com/4Db4CBJr0X
— ANI (@ANI) December 9, 2022
తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలన్న షర్మిల.. లేనిపక్షంలో తన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తన తల్లి విజయమ్మను కూడా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. తనను చంపేందుకు కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తోందని షర్మిల ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుత పోరాటంపై దాష్టీకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అధికార మదంతో,అహంకారంతో వెర్రవీగుతున్న పాలకపక్షానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు. అక్రమ అరెస్టులు ఆగే వరకు, పాదయాత్రకు అనుమతి ఇచ్చేంత వరకు పచ్చి మంచి నీళ్లు తాగకుండా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. pic.twitter.com/b51i7m14jo
— YS Sharmila (@realyssharmila) December 9, 2022
కాగా, శుక్రవారం రాత్రి సిద్దిపేటకు చెందిన షర్మిల అభిమాని ఒకరు దీక్ష వేదిక వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో పోలీసులు అతడ్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.