పోడు పట్టాలు కావాలంటే చీరలు లాగుతారా? ఇదేమైనా ధృతరాష్ట్ర పాలనా? వైఎస్ షర్మిల ధ్వజం
తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కేసీఆర్ ప్రభుత్వం తీరును టార్గెట్ చేస్తూ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా పోడు భూముల వ్యవహారంలో సీఎం కేసీఆర్ పై మండిపడ్డ షర్మిల దండేపల్లి మండలం కోయపోచగూడాలో పోడు సాగు చేస్తున్న రైతులతో నేరుగా మాట్లాడారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఇంతవరకు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని కేసీఆర్ ను దుయ్యబట్టారు.
పోడు భూముల పట్టాలు అడుగుతున్న కుటుంబాలను వేధిస్తున్నారు
2002 నుండి పోడు భూములను రైతులు సాగు చేసుకుంటున్నారని, ఇప్పటిదాకా పట్టాలు ఇవ్వకపోవడం మహా దారుణమని మండిపడిన షర్మిల వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. ఆయన కచ్చితంగా పోడు రైతులకు పట్టాలు ఇచ్చేవారని వైయస్ షర్మిల వెల్లడించారు. పోడు భూముల కోసం పోరాటం చేస్తున్న యాభై రెండు కుటుంబాలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, మహిళలను వేధిస్తున్నారని వైయస్ షర్మిల ఆరోపించారు. జైల్లో పెట్టి హింసిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
కేసీఆర్ పోడు రైతుల పట్టాలు ఇవ్వకపోగా వారి భూములు లాక్కుంటున్నారు
వైయస్సార్ ఇచ్చిన ఇళ్లను సైతం వదిలిపెట్టి ఇక్కడే గుడిసెలు వేసుకుని రైతులు జీవనం కొనసాగిస్తున్నారని, భూముల కోసం రైతులు కొట్లాడుతున్నారు అని వైయస్ షర్మిల పేర్కొన్నారు. పోడు రైతులకు పట్టాలిస్తానన్న కేసీఆర్.. ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వకపోగా, భూములు లాక్కుంటూ ఆదివాసీ గిరిజనుల పొట్ట కొడుతున్నాడు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. అటవీ అధికారులతో దాడులు చేయిస్తూ ఆనందం పొందుతున్నాడు అని విమర్శించారు.
మహిళల చీరలు వూడేటట్టు ఈడ్చుకెళ్ళినా దొర బయటకు రాడు
మహిళల చీరలు ఊడేటట్టు ఈడ్చుకెళ్లినా దొర గారు బయటకు రావడం లేదు అంటూ వైయస్ షర్మిల కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ వుండి కూడా చచ్చిన వారితో సమానం అంటూ వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ పోడు రైతులను జైలులో పెట్టి చిత్రహింసలకు గురిచేశాడు కెసిఆర్ అంటూ మండిపడ్డారు. చంటి పిల్లల తల్లులతో వెట్టి చాకిరి చేయించాడు అని వైయస్ షర్మిల ఆరోపించారు. ప్రజలందరినీ ఏకం చేసి, సాయుధ పోరాట స్ఫూర్తితో కేసీఆర్ నియంత పాలనను తరిమి కొడతాం అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ఇది మహాభారతమా? ఇదేమైనా ధృతరాష్ట్ర పాలననా? మండిపడిన షర్మిల
ఆనాడు పోడు భూముల వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని పట్టాలు ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారని కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, అటువంటి సర్కారు ఎందుకు అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పోడు పట్టాలపై కేసీఆర్ ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. పోడు చట్టాలనే మార్చాలంటున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు.
పట్టాలు కావాలని అడిగితే చీరలు లాగుతారా..? ఇది మహాభారతమా? ఇదేమైనా ధృతరాష్ట్ర పాలననా? అంటూ నిప్పులు చెరిగారు. ఓట్ల కోసమే కేసీఆర్ బూటకపు హామీలు ఇస్తున్నారని, గాడిదకు రంగు పూసి ఇది ఆవు అని నమ్మించే గుణం కేసీఆర్ ది అని వైయస్ షర్మిల మండిపడ్డారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పోడు పట్టాలు ఇస్తామని పేర్కొన్నారు.