కొలువుదీక్షలో వైఎస్ షర్మిల ధ్వజం: చందమామల్లాంటి పిల్లలు చనిపోతుంటే..కేసీఆర్ ది గుండెనా..బండరాయా?
తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసం నిరాహార దీక్షకు దిగిన షర్మిలకు పోలీసులు ఈ సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చినప్పటికీ, ఆమె 72 గంటల పాటు నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల కెసిఆర్ ది గుండెనా.. బండరాయా చెప్పాలని ప్రశ్నించారు.
చందమామ లాంటి పిల్లలు చనిపోతున్నా.. దున్నపోతుమీద వాన కురిసినట్టు కేసీఆర్ తీరు
వైయస్ షర్మిల కొలువు దీక్షలో భాగంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యోగాల కోసం చందమామ లాంటి పిల్లలు చనిపోతున్నారని అయినప్పటికీ దున్నపోతు మీద వాన పడుతున్న చందంగా కెసిఆర్ ప్రవర్తన ఉందని, ఆయనలో ఎలాంటి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేసిన వారు విద్యార్థులని, అలాంటి వారు ఈ రోజు ఉద్యోగాలు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు షర్మిల.
తెలంగాణలో ఉద్యోగాల కోసం విద్యార్థులు ఆత్మహత్యలపై స్పందించిన షర్మిల
ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని, చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. మొన్న సునీల్ నాయక్ అనే యువకుడు కాకతీయ యూనివర్సిటీ లో ఆత్మహత్య చేసుకున్నాడని తన చావు తర్వాత అయినా నోటిఫికేషన్లు రావాలని అతను కోరుకున్నాడు అని షర్మిల గుర్తు చేశారు. ఇక సిరిసిల్లలో మహేందర్ యాదవ్ తల్లిదండ్రులకు భారం అవుతున్నారని ఆత్మహత్య చేసుకున్నాడు.
కేసీఆర్ కు నిరుద్యోగుల ఆత్మహత్యలు కనిపించటం లేదా ?
నల్లగొండలో సంపత్ కుమార్ తనకు ఉద్యోగం వస్తుందని ఆశ పోయిందని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, నిరుద్యోగుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ ను నిలదీశారు వైయస్ షర్మిల.
ఇంతా జరుగుతున్నా సీఎం కేసీఆర్ తీరు మాత్రం దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉందన్నారు . చందమామ లాంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆ రోజు తెలంగాణ ఉద్యమం సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కు , ఇప్పుడు చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే ఆయనకు కనిపించడం లేదా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంట్లో గడియ వేసుకుని నిద్రపోతున్నారా ? కేసీఆర్ ఛాతీలో ఉన్నది గుండె నా.. లేక బండరాయినా
ఇంట్లో గడియ వేసుకుని నిద్రపోతున్నారా ? అని ప్రశ్నించిన షర్మిల, అసలు కేసీఆర్ ఛాతీలో ఉన్నది గుండె నా ? లేక బండరాయినా చెప్పాలని నిలదీశారు. లక్ష 91వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్న సీఎం కేసీఆర్ ఎందుకు భర్తీ చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు షర్మిల. ఏ పార్టీ పోరాటం చేసినా, చెయ్యకపోయినా యువతకు మద్దతుగా తాను నిలబడతానని స్పష్టం చేశారు . ఉద్యోగాలను భర్తీ చేయడమే కాదు, నిరుద్యోగులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Recommended Video
ఉద్యోగాలను భర్తీ చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుంది
వందల మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే అందుకు బాధ్యులు ఎవరు అంటూ సీఎం కేసీఆర్ ను నిలదీశారు షర్మిల. ఉద్యోగాలను భర్తీ చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపిన ఆమె 72 గంటలు నిరాహారదీక్ష చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఆ తర్వాత జిల్లాల్లో తమ నాయకులు ఉద్యోగాలను భర్తీ చేసే వరకు దీక్షలను కొనసాగిస్తారని షర్మిల పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర లేవాలి అని, ఉద్యోగాల భర్తీ చేయాలని షర్మిల వ్యాఖ్యానించారు.