రైతులు ధర్నాలు చేయాల్సింది ప్రగతి భవన్ ముందు.. కేసీఆర్ సర్కార్ పై షర్మిల ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రైతు మహాధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని విస్మరించి, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు కారణమైన మీరా రైతుల కోసం పోరాటాలు చేసేది అంటూ షర్మిల మండిపడ్డారు.
కెసిఆర్ సర్కార్ ను ఉతికి ఆరేసిన వైయస్ షర్మిల రైతుల మహాధర్నాల వెనుక, రైతుల కోసం తాము పని చేస్తున్నామని చెప్పడం వెనుక బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ రాజకీయ స్వార్థం ఉందని తేల్చి చెప్పారు. రైతు అజెండాతో వెళ్తే జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకోవచ్చు అన్న భావనతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు.
8ఏళ్లలో 8వేల మంది రైతులు చనిపోతే ఏరోజైనా కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుందా?
బీఆర్ఎస్ పార్టీకి బిజెపికి చెడింది కాబట్టి.. మీ పంచాయతీని రైతుల పంచాయతీ చేస్తున్నారా ? అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రైతు కల్లాల కోసం ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వమంటున్నారు అని, ధర్నాలకు నిరసనలకు పిలుపునిస్తూ మధ్యలో రైతులను బలి చేయాలని చూస్తున్నారా? అంటూ వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. ఎనిమిది ఏళ్లలో ఎనిమిది వేల మంది రైతులు చనిపోతే ఏరోజైనా కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకుందా? చెప్పాలని వైయస్ షర్మిల నిలదీశారు.
రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరేం చేశారు?
వరి వేస్తే ఉరేనని చెప్పి.. వడ్లు కొనకుండా కల్లాల్లోనే రైతుల గుండెలు ఆగిపోతే మీ గుండెలకు ఎన్నడైనా బాధ కలిగిందా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పురుగు పట్టి, వరదలు వచ్చి పంటలు నష్టపోతే.. పెట్టిన పెట్టుబడి రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. రైతుల గోస ఏనాడైనా మీ కంటికి కనబడిందా అంటూ వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు.
రైతులు ధర్నాలు చేయాల్సింది ప్రగతి భవన్ ముందు
రైతులకు మేలు చేసే రాయితీలు అన్నింటినీ బంద్ పెట్టి.. రైతు చనిపోతే ఐదు లక్షల సాయం అని చెప్పి, బ్రతికుండగా రైతును ఆదుకునే మీరు ఈరోజు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ దేశ రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్నారా? అంటూ వైయస్ షర్మిల ప్రశ్నించారు. మీది కిసాన్ కిల్లర్ సర్కార్ అంటూ వైయస్ షర్మిల కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు . ఈ రోజు రైతులు ధర్నాలు చేయాల్సింది .. ప్రగతి భవన్ ముందు.. నిరసనలు చేయాల్సింది ఫామ్ హౌస్ ముందు అంటూ షర్మిల తనదైన శైలిలో కేసీఆర్ ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
రైతులు ఉతికి ఆరెయ్యాల్సింది బీఆర్ఎస్ పార్టీని
రైతులు ఉతికి ఆరేయాల్సింది రైతు పేరిట అప్పులు తెచ్చి .. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన బి ఆర్ ఎస్ పార్టీని,రైతు ద్రోహి ప్రభుత్వాన్ని, రైతు హంతక ప్రభుత్వాన్ని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ రైతుల పేరుతో చేస్తున్న రాజకీయాలను వైయస్ షర్మిల తూర్పారబట్టారు. కెసిఆర్ కు రైతుల పట్ల ఎటువంటి ప్రేమ లేదని, కేవలం రాజకీయాల కోసమే కెసిఆర్ రైతుల పేరు వాడుకుంటున్నారు అంటూ వైయస్ షర్మిల తేల్చిచెప్పారు.