మోడీ, కేసీఆర్ ఒకే తానుముక్కలు; వారిద్దరూ భాయి భాయి: లేఖాస్త్రాల డ్రామాలంటూ ఏకిపారేసిన షర్మిల
వైయస్సార్టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల నిత్యం ఏదో ఒక విషయంలో తెలంగాణ సీఎం కెసిఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని బిజెపి పైన కూడా షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని టార్గెట్ చేసిన వైయస్ షర్మిల వారిద్దరూ ఒకే తాను ముక్కలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణా సర్కార్ ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో అనేక సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల రాష్ట్రం లో నిరుద్యోగ సమస్య పై తన గళం విప్పి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు రైతాంగ సమస్యలపై, రైతుల ఆత్మహత్యలపై కెసిఆర్ సర్కార్ పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని, తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిత్యం టార్గెట్ చేస్తూ ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు వైఎస్ షర్మిల.
మోడీ, కేసీఆర్ లు ఒకే తాను ముక్కలు, ఇద్దరూ రాష్ట్రానికి చేసిందేమీ లేదు
తాజాగా దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని వైయస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. మోడీ, కేసీఆర్ లు ఇద్దరు ఓకే తాను ముక్కలు అని ఎద్దేవా చేసిన వైఎస్ షర్మిల, దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమిలేదని , కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోడీ గారు ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
మోడీ, కేసీఆర్ ఉద్యోగాలిచ్చింది లేదు, తెలంగాణాలో కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు లేదు
ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కెసిఆర్ గారు ఉన్న ఉద్యోగులను పీకేస్తూ, నిరుద్యోగులు చచ్చేలా చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు అన్యాయం చేసి మహారాష్ట్రపై ప్రేమ కురిపించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే తెలంగాణకు రైల్వే ఫ్యాక్టరీ సాధించడంలో కేసీఆర్ కొట్లాడింది లేదు అంటూ వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో మోదీ కేంద్ర విద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసింది లేదు అంటూ కేంద్ర సర్కారు తీరు పైన నిప్పులు చెరిగారు. కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందించింది లేదు అని అటు మోడీ ఇటు కేసిఆర్ ఇద్దరి తీరు ఒకే విధంగా ఉందని వ్యాఖ్యలు చేశారు షర్మిల.
Recommended Video
దొంగే దొంగ అన్నట్టు ఇద్దరి తీరు .. లేఖాస్త్రాల డ్రామాలు
రేపు రాబోవు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ అన్నట్లు .. టీఆర్ఎస్, బీజేపీలు లేఖాస్త్రాల డ్రామాలకు తెరలేపాయి తప్పతెలంగాణకు కేసీఆర్, మోదీలు చేసింది ఏమీ లేదని షర్మిల తిట్టిపోశారు. మోడీ, కెసిఆర్ దొందూ దొందే. ఇద్దరు దొంగలే అనే అభిప్రాయం వ్యక్తం చేసిన వైయస్ షర్మిల కెసిఆర్, మోడీ భాయి భాయి అంటూ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇద్దరు వల్ల అటు దేశానికి, ఇటు రాష్ట్రానికి జరిగిన లాభం ఏమీ లేదని వైయస్ షర్మిల తేల్చిచెప్పారు.