ఒట్టేసి చెబుతున్నా - షర్మిల కన్నీటి పర్యంతం : దీక్షలో తల్లి విజయమ్మ..!!
YS Sharmila Deekhsa: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ షర్మిల కీలకంగా మారుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్...టీఆర్ఎస్ ప్రభుత్వంపైన షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవటం పైన ఫైర్ అయ్యారు. పోలీసులతో జరిగిన తోపులాటలో షర్మిలకు, పార్టీ నేతలకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు.
తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని శపథం చేసారు. ఇంటి వద్దే దీక్షకు దిగారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదంటూ ఒట్టేసి చెబుతున్నానన్నారు. షర్మిల ఆవేదన చూసి తల్లి విజయమ్మ చలించారు. దీక్షలో ఉన్న కుమార్తెకు తల్లి విజయమ్మ మద్దతు ప్రకటించారు.
ఒట్టేసి చెబుతున్నానంటూ..షర్మిల
తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోటం పైన వైఎస్సార్టీపి అధినేత్రి షర్మిల ఆవేదన వ్యక్తం చేసారు. తన పైన కుట్ర చేస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వేదికగా చేసుకున్న పరిణామాలతో ప్రధాని మోదీ ఫోన్ చేసి షర్మిలకు సంఘీభావం ప్రకటించారు. షర్మిల కమలం పార్టీ వదలిన బాణంగా టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీని పైన షర్మిల స్పందించారు.
తనకు ఏ పార్టీ తో సంబంధం లేదని స్పష్టం చేసారు. తాను తెలంగాణ ప్రజల కోసమే కోట్లాడుతున్నానని..ఇప్పటికే ఇదే విషయం పలు మార్లు చెప్పానని వెల్లడించారు. తనకు ఏ పార్టీతోనూ ఎటువంటి ఒప్పందాలు లేవన్నారు.
తన బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నానని..తనకు దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్న ఏ పార్టీతో కూడా సంబంధం లేదని షర్మిల చెప్పుకొచ్చారు. బీజేపీ - బీజేపీ మధ్య స్నేహం ఉందని ఆరోపించారు. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చి, తనకు ఎందుకు ఇవ్వరని షర్మిల ప్రశ్నించారు.
ఇంట్లోనే దీక్ష - విజయమ్మ మద్దతు
షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి అక్కడే షర్మిల దీక్షకు దిగారు. పోలీసులు షర్మిలను అక్కడి నుంచి తరలించి లోటస్ పాండ్ కు చేర్చారు. అక్కడ రోడ్డు పైనే మద్దతు దారులతో కలిసి షర్మిల దీక్షకు దిగే ప్రయత్నం చేయగా..పోలీసులు అడ్డుకున్నారు.
ఆ సమయంలో పోలీసులు..షర్మిల మద్దతు దారుల మధ్య కొంత సేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో, షర్మిల తన నివాసంలోనే దీక్షకు దిగారు. షర్మిలకు తల్లి విజయమ్మ మద్దతు ప్రకటించారు. దీక్షలో కూర్చుకున్నారు. వేదిక పైనే దీక్షలో ఉన్న షర్మిలను ముద్దాడారు. సీఎం కేసీఆర్ నియంతలా పాలన చేస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు.
పోలీసుల భుజాన తుపాకీ పెట్టి తనను టార్గెట్ చేసారని ఆరోపించారు. కేసీఆర్ కు తెలంగాణతో బంధం తెగిపోయిందన్నారు. ఇక్కడ దోచుకోవడం పూర్తికావడంతో దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరారని ఆరోపించారు.
ప్రాణ హాని ఉంది- అమ్మను అడ్డుకుంటున్నారు
షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు న్యాయం చేసి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు.కేసీఆర్ బిడ్డ లిక్కర్ మాఫియాలో ఉంటే, కొడుకు లాండ్ మాఫియాలో ఉన్నారని ఆరోపించారు. కేసులు పెడతామని ఊరికే వదిలేది లేదని షర్మిల పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఓటుతో వారు బుద్ది చెబుతారని అన్నారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని షర్మిల స్పష్టం చేసారు. దీంతో, రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల తీసుకొనే నిర్ణయాలు.. వేసే అడుగులు రాజకీయంగా కీలకం కానున్నాయి.