వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తేనెటీగల దాడి; సహాయక సిబ్బంది ఏం చేశారంటే
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల సమస్యలను నేరుగా వారి వద్దకే వెళ్లి తెలుసుకుంటున్న వైయస్ షర్మిల తెలంగాణా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తున్నారు. తన 34వ రోజు పాదయాత్ర ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారు. అయితే ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహిస్తున్న వైయస్ షర్మిల బృందంపై ఈరోజు తేనెటీగలు దాడి చేశాయి.
34 వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల
నేడు మోటకొండూరు మండలం వరుటూరులో వైయస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర ప్రారంభమైంది.అక్కడి నుంచి దుర్గసానిపల్లి, చండేపల్లి, చామపూరు, రేలకుంట గ్రామాల మీదుగా పాదయాత్ర సాగుతోంది.అనంతరం పల్లెపహడ్ గ్రామంలో మాట- ముచ్చట నిర్వహించి,ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు వైయస్ షర్మిల. ఈ క్రమంలో మోట కొండూరు మండలం నుండి పాదయాత్ర ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో దుర్శగాని పల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో వైఎస్ షర్మిల మాట్లాడారు.అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
షర్మిల బృందంపై తేనెటీగల దాడి.. కాపాడిన సహాయక సిబ్బంది
ఇదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. వైయస్ షర్మిల సహాయక సిబ్బంది అప్రమత్తం కావడంతో తేనెటీగలు దాడి నుండి వైఎస్ షర్మిల బయటపడ్డారు. తేనెటీగలు దాడి చేస్తున్నా వైయస్ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగించారు. కండువాలతో వైఎస్ షర్మిల సహాయక సిబ్బంది వాటి బారి నుండి వైఎస్ షర్మిలను కాపాడారు. అయితే తేనెటీగలు పలువురు వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను కుట్టినట్లుగా తెలుస్తుంది.
400కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ షర్మిల
ఇదిలా ఉంటే వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం చండేపల్లి గ్రామంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. అక్కడి ప్రజలను కలిసి మాట్లాడిన షర్మిల వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో తనకు తోడుగా వెన్నంటి నడుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు.
అగ్నిప్రమాద ఘటనపై వైయస్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై వైయస్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో కూలీల మృతి తనను ఎంతో కలచివేసిందని వైయస్ షర్మిల పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్న షర్మిల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.