కేసీఆర్ ప్లాన్: వైపీసీని కలిపేసుకోవడమే, పొంగులేటికి లింకేమిటీ?
హైదరాబాద్: తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్లోకి తెలుగుదేశం పార్టీని ఎలాగైతే విలీనం చేశారో అదే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' లో భాగంగా టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ మధుసూధనాచారికి లేఖ ఇవ్వడం ఆయన అందుకు టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేసేందుకు అనుమతించడం చకా చకా జరిగిపోయాయి. ఆ తర్వాత జరిగిన బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో ముందు వరుసలో సీట్లు కూడా కేటాయించారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున జరిపేందుకు పార్టీ నిర్ణయించింది. ఈ ప్లీనరీ సమావేశాల్లోనే వైసీపీ తరుపున తెలంగాణలో గెలిచిన ఖమ్మం ఎంపీ, తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబి గూటికి చేరనున్నారు.
పొంగులేటితో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించకున్నా నియోజక వర్గాల్లోని పార్టీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు.
వారి నుంచి వీరిద్దరికి పూర్తి మద్దతు రావడంతో ఖమ్మం జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో సహా పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి వైసీపీ తరుపున ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుపొందారు.
ఇందులో తాటి వెంకటేశ్వర్లు, బానోతు చందూలాల్ ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు కూడా టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో టీఆర్ఎస్ ప్లీనరీని ముహూర్తంగా ఎంచుకున్నారు.
అయితే పొంగులేటి టీఆర్ఎస్లో చేరడం వెనుక పెద్ద కథే ఉంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి దామెదర రెడ్డి మరణంతో త్వరలో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజక వర్గానికి ఉపఎన్నికలు రానున్నాయి. పొంగులేటి గనుక టీఆర్ఎస్లో చేరితే పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని సమాచారం.
ఈ డీల్ మేరకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారని నియోజక వర్గంలోని ప్రజలు అనుకుంటున్నారు. ఎంపీ పొంగులేటి చేరికతో ఖమ్మంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంతో పాటు పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
మరోవైపు ఖమ్మం జిల్లాను టీఆర్ఎస్కు కంచుకోట చేసే విధంగా జిల్లాలోని కాంగ్రెస్, టీడీపీ, వైసీపీకి చెందిన చోటా మోటా లీడర్లను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.