చంద్రబాబు కూటమికి షాక్: టీఆర్ఎస్ గెలుపుకు హైదరాబాద్లో రంగంలోకి జనసేన, వైసీపీ!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస, బీజేపీ, మజ్లిస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి మహాకూటమిగా ఏర్పడి రంగంలోకి దిగాయి. తెరాస, మహాకూటమి మధ్యే పోటాపోటీ నెలకొని ఉంది. బీజేపీ డబుల్ డిజిట్కు చేరుకోవాలని చూస్తోంది. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని సీమాంధ్రుల ఓటర్లు టీడీపీ ద్వారా కూటమికి వస్తాయని భావిస్తున్నారు.
ఈ వ్యూహంలో భాగంగానే కూకట్పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి కుటుంబ సభ్యురాలు సుహాసినిని బరిలోకి దింపారు. ఆమె ద్వారా అందరి దృష్టిని కూటమి తమవైపుకు తిప్పుకుంది. ముఖ్యంగా కూకట్పల్లితో పాటు సీమాంధ్రులు అధికంగా ఉన్నచోట ఈ ప్రభావం కనిపించనుంది. అందుకే తెరాస నేతలు సీమాంధ్రుల ప్రభావం ఉన్నచోట ఆచితూచి మాట్లాడుతున్నారు.
జనసేన, వైసీపీ భయం
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కీలక పార్టీలుగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్, జనసేనలు పోటీ చేయడం లేదు. జగన్, పవన్ కళ్యాణ్లు ప్రధానంగా ఏపీ పైనే దృష్టి సారించారు. టీడీపీ అండ ద్వారా సీమాంధ్రుల ఓట్లు తమకే వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ జనసేన, వైసీపీలు తెరాసకు మద్దతు పలకడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అలాగే, కాపు నేతలు పలువురు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కేటీఆర్ను కలిసి మద్దతు తెలిపారు.
తెరాసకు కాపు నేతల మద్దతు
శనివారం కేటీఆర్ హైదరాబాదులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత కాపు, తెలగ, బలిజ సంఘం నేతలు ఆయనను కలిసి తెరాస అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. తొలగించిన 26 కులాలకు రిజర్వేషన్ పునరుద్ధరించాలని వారు ఈ సందర్భంగా కేటీఆర్ను కోరారు. ఎన్నికల నియమావళి వల్ల దీనిపై ఇప్పుడే తాను ఏమీ చెప్పలేనని కేటీఆర్ అన్నారు.
టీడీపీ సీట్లపై తెరాస ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజార్టీ సీట్లు సాధిస్తే ఏ పార్టీకి అయినా అధికారంలోకి రావడం సులభం. తెరాసకు గత ఎన్నికల్లో నగరంలో పట్టు లేదు. కానీ ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా టీడీపీ పోటీ చేసిన స్థానాలపై కన్నేసింది. ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు సీమాంధ్రులను మచ్చిక చేసుకోవాల్సిందేనని తెరాస భావిస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ నగర పరిధిలోని కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, సనత్ నగర్, మలక్పేట నియోజకవర్గాలలో పోటీ చేస్తోంది. మలక్పేట కాకుండా మిగిలిన చోట్ల సీమాంధ్రుల ఓట్లే కీలకం. ముఖ్యంగా శేరిలింగంపల్లి, సనత్ నగర్, కూకట్పల్లి నియోజకవర్గాలలో ఎక్కువ ఓట్లు ఉంటాయి.
పావులు కదుపుతున్న జనసేన, వైసీపీ
టీఆర్ఎస్కు వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల స్థానిక నాయకులు అనధికారికంగా అండగా నిలబడుతున్నారని అంటున్నారు. ఆ రెండు పార్టీల నాయకులు స్వయంగా రంగంలోకి దిగి పావులు కదుపుతున్నారు. తెరాసకు అనుకూలంగా వారు ఆయా వర్గాలను కూడగడుతున్నారట. కొన్నిసామాజిక వర్గాలను టీడీపీకి లేదా మహాకూటమికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయా పార్టీల స్థానిక నాయకులు దాదాపు నెల రోజుల క్రితమే రంగంలోకి దిగారట.
సభలతో మద్దతు
రాయలసీమలో బలంగా ఉండి వైసీపీని అభిమానించే వారు ముఖ్యంగా రంగంలోకి దిగి, కార్తీక వన భోజనాల పేరుతో ఓట్లను తెరాస వైపు మరల్చారని అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమై సూచనలు చేశారట. తెరాసకు ఓటు వేయాలని చెబుతున్నారట. చెప్పాలంటే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలాగైతే ప్రచారం చేస్తారో.. ఆ స్థాయిలో బయటకు తెలియకుండా అంతర్గతంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట.
కూటమికి అదే బలం
జనసేనను అభిమానించే వారు కూడా అలాగే రంగంలోకి దిగి, తెరాసకు మద్దతు కూడగడుతున్నారట. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉండే సామాజిక వర్గపు ఓటర్లు కూకట్పల్లి నియోజకవర్గంలో అధికంగా ఉండటంతో ఈ వర్గం నాయకులు కూడా అంతర్గత సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారట. మరోవైపు టీడీపీ కూడా కౌంటర్గా తన ప్రయత్నాలు చేస్తోందట. గత ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో టీడీపీ 22 శాతానికి పైగా ఓట్లు పొందింది. తొమ్మిది సీట్లు గెలిచింది. టీఆర్ఎస్ 19 శాతం ఓట్లతో మూడు సీట్లలో గెలిచింది. నాలుగున్నరేళ్లుగా తెరాస బలం పెరిగినప్పటికీ కాంగ్రెస్, టీడీపీ కలవడం మైనస్ కూటమికి బలం.