తెలంగాణలో బతకడం అంటే..మందుపాతర మీద ఉన్నట్టే: షర్మిల
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి రక్షణ ఉండట్లేదని, ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మెడికో ప్రీతి ఉదంతం సహా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న సంభవించిన ఘాతుకాలే దీనికి నిదర్శనమంటూ ధ్వజమెత్తారు.
మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదంటూ వైఎస్ షర్మిల అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న రాణి రుద్రమ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేశారు. నోటికి నల్ల రిబ్బన్ ను కట్టుకుని నిరసన ప్రదర్శనలో బైఠాయించారు. ఆమెకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడే నిరసనలకు దిగారు.

దీనితో ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. నిరసన దీక్షను విరమించాల్సిందిగా వైఎస్ షర్మిలకు సూచించారు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ట్యాంక్ బండ్ వద్ద నుంచి నేరుగా బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటి తరువాత ఆమెను లోటస్ పాండ్ లోని నివాసానికి తీసుకెళ్లారు.
అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడారు. మహిళలపై వేధింపులు, అఘాయిత్యాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎన్నికల సంవత్సరం కావడం వల్లే మహిళలపై కేసీఆర్ కు కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. మహిళలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తోన్నారని మండిపడ్డారు. తెలంగాణలో బతకడం అంటే మందుపాతర మీద బతికినట్టే ఉందని ఘాటు విమర్శలు చేశారామె.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓ మహిళ అనే విషయాన్ని కూడా అధికార పార్టీ నాయకులు మర్చిపోయినట్టున్నారని షర్మిల అన్నారు. రాష్ట్రానికి ప్రథమ పౌరురాలైన గవర్నర్ ను కూడా గౌరవించుకోలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. పాదయత్ర చేస్తూ.. ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్న తనను అనరాని మాటలు అన్నారని గుర్తు చేశారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్నారు.












Click it and Unblock the Notifications