ఆరో రోజుకు చేరిన వైఎస్ షర్మిల పాదయాత్ర: కంప్లీట్ షెడ్యూల్ ఇదే: మాట-ముచ్చటతో జనంతో మమేకం
హైదరాబాద్: తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి సమగ్ర అవగాహనను ఏర్పరచుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టిన మహా పాదయాత్ర.. సోమవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. ఈ నెల 20వ తేదీన ఆమె రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగాల్సి ఉంది.
గ్రామస్థాయి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేలా..
చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర పూర్తయింది. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర సాగుతోంది. చేవెళ్ల టౌన్లో బహిరంగ సభను నిర్వహించిన అనంతరం ఆమె పాదయాత్ర మొదలైంది. తల్లి వైఎస్ విజయమ్మ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేవెళ్ల, శంషాబాద్ తరువాత మహేశ్వరంలో బహిరంగ సభను నిర్వహించారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలను గుప్పిస్తున్నారు. గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను ప్రభుత్వం దృఫ్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోన్నారు.
మహేశ్వరం విలేజ్ నుంచి మొదలు..
ప్రస్తుతం షర్మిల పాదయాత్ర మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. మహేశ్వరం విలేజ్లో ఆదివారం రాత్రి ఆమె బస చేశారు. ఈ ఉదయం 9:30 గంటలకు తన పాదయాత్రను ప్రారంభిస్తారు. తాను బస చేసిన క్యాంప్ నుంచి బయలుదేరుతారు. 9:45 నిమిషాలకు తుమ్మలూర్కు చేరుకుంటారు. ప్రజలను కలుసుకుంటారు. 10:30 గంటలకు మొహబ్బత్ నగర్ క్రాస్, 11 గంటలకు తుమ్మలూర్ గేట్, 11:15 నిమిషాలకు రాచలూర్ గేట్, 11:45 నిమిషాలకు కందుకూర్ మండలంలోని బైరాగి గూడ క్రాస్కు చేరుకుంటారు. ప్రతి పాయింట్లోనూ ఆమె స్థానిక ప్రజలను కలుసుకుంటారు.
లేమూర్ వద్ద మధ్యాహ్న భోజన విరామం..
మధ్యాహ్నం 12 గంటలకు లేమూర్ క్రాస్కు చేరుకుంటారు. అక్కడే భోజన విరామం ఉంటుంది. మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకుంటారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్రను పునఃప్రారంభిస్తారు. 3:30 గంటలకు లేమూర్ క్రాస్కు చేరుకుంటారు. అక్కడ ప్రజలతో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారు. వారి నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. సాయంత్రం 5 గంటలకు అగర్మియాగూడ గ్రామానికి చేరుకుంటారు.
బహిరంగ సభ లేనట్టే..
ఆరో రోజు పాదయాత్రలో శంషాబాద్, మహేశ్వరం వంటి టౌన్లు ఏవీ లేనందున.. బహిరంగ సభ దాదాపుగా లేనట్టే. దాని స్థానంలో మాట-ముచ్చట కార్యక్రామన్ని వైఎస్ఆర్టీపీ నాయకులు ఏర్పాటు చేశారు. కందుకూర్ మండలంలో లేమూర్ వద్ద ఈ సాయంత్రం 3:30 గంటలకు స్థానికులతో మాట-ముచ్చటలో పాల్గొంటారు వైఎస్ షర్మిల. వారు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటోన్న సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం పనితీరు గురించి ఆరా తీస్తారు. వాటిని ఎలా పరిష్కరించవచ్చనే విషయంపైనా మాట-ముచ్చట కార్యక్రమం సందర్భంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు.
Recommended Video
26 సమన్వయ కమిటీలు..
పాదయాత్ర ముగిసిన అనంతరం పార్టీ నేతలతో సమావేశమౌతారు. ఆ రోజు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల గురించి చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో ఒక నోట్ను తయారు చేస్తారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేస్తారు. పాదయాత్రను విజయవంతం చేయడానికి వైఎస్సార్టీపీ అగ్ర నాయకత్వం కోఆర్డినేషన్ కమిటీలను కూడా నియమించింది. మొత్తంగా 26 సమన్వయ కమిటీలు వైఎస్ షర్మిల పాదయాత్ర కోసం పని చేస్తోన్నాయి.