షర్మిల పార్టీలోకి తెలంగాణ సీనియర్లు..!! ఇప్పటికే మంతనాలు పూర్తి : అంతా అప్పుడే...!!
తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రకటనకు వైఎస్ షర్మిల సంసిద్దులవుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్టీపీ పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ నెలాఖరులోగా ఎన్నికల సంఘం నుండి అధికారికంగా పార్టీ పైన ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించనుంది. ఇక, జూలై 8న తన తండ్రి జన్మదినం నాడు పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ రోజు జరిగిన పార్టీ ఆవిర్భావ సన్నాహక సదస్సు లో షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. కొంత మంది ఇతర పార్టీలకు చెందిన సీనియర్లు టచ్ లో ఉన్నారంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, పార్టీ అజెండా..విధి విధానాలు వెల్లడించిన తరువాత వారు పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో వైఎస్ తో కలిసి పని చేసిన వారు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
Recommended Video
షర్మిలతో టచ్ లో సీనియర్ నేతలు..
పాలమూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత గతంలో ప్రాంతీయ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసి..ఆ తరువాత జాతీయ పార్టీలో చేరారు. అక్కడ గుర్తింపు లేకపోవటంతో దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సన్నిహితులు ఆ నేత దూతలుగా ఇప్పటికే సంప్రదింపులు చేసినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సైతం షర్మిల పార్టీ పట్ల ఆసక్తిగా ఉన్నారని..అయితే, పార్టీ కార్యక్రమాలు..స్పందన చూసిన తరువాత పార్టీలో చేరేందుకు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో మంత్రి పదవి ఖాయమని ఆశించి భంగపడ్డ సీనియర్ పొలిటీషియన్..నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే..హైదరాబాద్ నగరానికి చెందిన జాతీయ పార్టీ మాజీ నేత సైతం టచ్ లో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అయితే, షర్మిల పార్టీ ఏర్పాటు తరువాత...పాదయాత్ర కు సిద్దం అవుతున్నారు.
మరింత స్పష్టత కోసం వెయిటింగ్..
పార్టీ ఏర్పాటు తరువాత..జిల్లాల వారీగా కమిటీలు..అధ్యక్షులను ప్రకటించనున్నారు. జిల్లా స్థాయిల్లో కమిటీల తరువాత పాదయాత్ర చేస్తూ...అన్ని జిల్లాల్లోనూ కొనసాగేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఆ సమయంలో ప్రజల నుండి వచ్చే స్పందన ఆధారంగా ఇప్పుడు టచ్ లో ఉన్న నేతలు ఓపెన్ గా పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కొండా సురేఖ తమకు షర్మిల పార్టీ నుండి ఆహ్వానం అందిందని చెబుతూనే..తాము ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దంగా లేమని తేల్చి చెప్పారు. షర్మిల అన్న జగన్ ఏపీ సీఎంగా ఉండటంతో...గతంలో సమైక్యవాదం వినిపించటంతో ఇప్పుడు ఆ పార్టీలో చేరటం ద్వారా తమ పైన ఎటువంటి ఆరోపణలు చేస్తారో అనే మీమాంస సైతం ఆ నేతలను వెంటాడుతోంది. దీంతో..పార్టీ ప్రకటన ద్వారా షర్మిల తన వైఖరి పైన మరింత స్పష్టత ఇవ్వనున్నారు.
ఆవిర్బావం నాడు ఆ ఇద్దరు నేతలు..
ఆ తరువాత షర్మిలతో కలిసి రాజకీయంగా అడుగులు వేసేందుకు అభ్యంతరం ఉండదని ఆ నేతలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, షర్మిల నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పు బడుతున్నారు. అయినా.. షర్మిల పైన ఇప్పటి వరకు గులాబీ నేతలు మాత్రం తిరిగి విమర్శలు చేయటం లేదు. ఇది వ్యూహంలో భాగమా..లేక ఇగ్నోర్ చేయటమా అనేది స్పష్టత రావాల్సి ఉంది. తనకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని..తాను ఎవరు వదిలిన బాణం కాదని..ప్రజాబాణమంటూ షర్మిల స్పష్టం చేసారు. అయితే, ఇద్దరు సీనియర్ నేతలతో మాత్రం పార్టీ ఆవిర్భావం రోజున పార్టీలో చేరే విధంగా మంతనాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. పాలమూరు .. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన ఆ ఇద్దరు నేతలు పార్టీలో చేరటం దాదాపు ఖాయంగా తెలుస్తోంది.