ఇలాగైతే తెలంగాణను మేం పాలిస్తాం: సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఇంగ్లీష్ చదువులపై ఆకర్షణతో తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను ప్రయివేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని ప్రయివేటు పాఠశాల్లలో మూడేళ్ల వయసున్న పిల్లల్ని చేర్చుకుంటున్నారని, అదే ప్రభుత్వ పాఠశాలల్లో అయిదారేళ్లు వచ్చే వరకు చేర్చుకోరని, ఎక్కడ ఇంగ్లీషు చదువు లభిస్తే తల్లిదండ్రులు అక్కడే చేర్పిస్తున్నారని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదని తెలంగాణ తరఫు లాయర్లు సుప్రీంకు వెల్లడించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల భర్తీపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
తెలంగాణ తరఫు న్యాయవాదులపై వివరణ పైన సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగైతే రాష్ట్రాన్ని మేం పాలించాలని జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమిపై జేకే రాజు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివ కీర్తి సింగ్తో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది.
ఈ సందర్భంగా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తాము పర్యటించామని, మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉందని, జూలై మొదటి వారంలో నివేదిక ఇస్తామని సుప్రీం కోర్టు నియమించిన పరిశీలన కమిటీ చైర్మన్ గుప్తా కోర్టుకు తెలిపారు.
కాగా, గత ఏడాది కూడా ఒక్క విద్యార్థీ నమోదు కాని పాఠశాలలు ఉన్నా వాటిని తాము మూసేయలేదని, ఈ ఏడాది కూడా అలాంటి పాఠశాలలు ఉంటాయని, విద్యార్థుల సంఖ్య నమోదు తక్కువైపోతున్న పాఠశాలల్ని ఏం చేయాలనేది పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
ఆయా పాఠశాలల్ని కాపాడుకునే బాధ్యతను ప్రజలకే అప్పగిస్తున్నామని, అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నానన్నారు.
తల్లిదండ్రుల్లో విద్యపై అవగాహన పెరిగిందని, తమ పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదివితే మెరుగైన విద్య లభిస్తుందని, ఉపాధి దొరుకుతుందనే భావనలో ఉన్నారన్నారు. ఆ భావన తప్పని తాను చెప్పడం లేదని, అయితే, ఇంగ్లిషు పాఠశాలల్ని తెరవాలంటే ప్రభుత్వానికి సమస్యలు ఉన్నాయన్నారు.
ఇంగ్లిషు మీడియం పట్ల తల్లిదండ్రుల ఆసక్తి, ఉదయాన్నే ప్రైవేటు స్కూలు బస్సులు పల్లెలకు వచ్చి పిల్లల్ని తీసుకెళ్లటం, ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిగా పాఠశాలలకు వెళ్లకపోవటం వంటి చాలా కారణాల వల్ల సున్నా విద్యార్థుల నమోదు ఉందని తెలిపారు. ఈ స్థితి తెలంగాణది మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ఉందని, కావాలనే ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి తమపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారన్నారు.












Click it and Unblock the Notifications