తిరుపతి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుమంది దుర్మరణం
తిరుపతి: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తోన్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతులను విజయవాడ వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి- శ్రీకాళహస్తి జాతీయ రహదారిపై ఈ మధ్యాహ్నం ఈ దుర్ఘటన సంభవించింది.

విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తోన్న ఏపీ 39 జీజే 3233 నంబర్ గల మారుతి ఎర్టిగా కారు జాతీయ రహదారిపై ఏర్పేడు-మిట్టకండ్రిగ సమీపంలో అదుపు తప్పింది. ఎదురుగా వస్తోన్న లారీని వేగంగా ఢీ కొట్టింది. ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది.
ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. కారులో ప్రయాణిస్తోన్న వారిలో ఒక్కరు మినహా మిగిలిన ఆరుమందీ అక్కడికక్కడే మరణించారు. కారు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జయింది. బోనెట్.. లారీ కింది భాగంలోకి దూసుకెళ్లింది. ఫ్రంట్ సీట్లో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. వాటిని వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.

సంఘటన చోటో చేసుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యల్లో దిగారు. 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో తిరుపతి-శ్రీకాళహస్తి మధ్య వాహనాల రాకపోకలు స్తంభించాయి.












Click it and Unblock the Notifications