తిరుమల శ్రీవారి ఉత్సవ మూర్తులకు ఇక నుండి ఏడాదికి ఒకసారే అభిషేకం .. టీటీడీ బోర్డు ఆమోదం .. ఇదే కారణం !!
కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తుల పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అభిషేకాలను తగ్గించాలని నిర్ణయించింది. శ్రీవారి ఉత్సవమూర్తులకు ఏడాదిలో 450 సార్లు అభిషేకం నిర్వహిస్తుంటారు. ఈ అభిషేకాల వల్ల ఉత్సవమూర్తుల రూపు మారిపోతుందని, అరుగుదల కనిపిస్తుందని గుర్తించిన అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు, టీటీడీ సభ్యులతో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఉత్సవ మూర్తులను కాపాడుకునేందుకు ఏడాదికి ఒకసారి మాత్రమే అభిషేకాలను నిర్వహించాలని నిర్ణయించారు.

ఏడాది పొడవునా స్వామి వారికి 450 సార్లు అభిషేకాలు
ప్రతి సోమవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక బుధవారం సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. నిత్యం స్వామివారికి ఆర్జిత వసంతోత్సవం సేవలను కొనసాగిస్తున్నారు. ఇక స్వామివారి ఉత్సవమూర్తులకు పండుగలు ,ఉత్సవాల సమయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇలా ఏడాది పొడవునా ప్రతిరోజూ మలయప్పస్వామి తోపాటు శ్రీదేవి , భూదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు 450 సార్లు అభిషేకాలు నిర్వహిస్తారు.

విగ్రహాలు అరిగిపోతున్నట్టు గుర్తించి అర్చకులు , ఆగమ సలహా మండలి ప్రతిపాదన
దీనివల్ల విగ్రహాలు అరిగిపోతున్నట్లుగా అర్చకులు గుర్తించారు. విగ్రహాల ముఖాలు సరిగా కనిపించడం లేదని, రూపం మారిపోతోందని, ఈ అరుగుదలను నివారించడానికి అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు, పెద్ద జీయంగార్ తదితరులు టీటీడీ అధికారులకు, బోర్డుకు కొన్ని ప్రతిపాదనలు చేశారు. అభిషేకాల వల్ల ఆరాధన పీఠం కూడా దెబ్బతింటుందని వారంటున్నారు.
అంతేకాదు ప్రస్తుతం నిర్వహిస్తున్న అభిషేక సేవలకు తిరుమల శ్రీవారి పూజా విధానంలో ఎలాంటి చారిత్రక ప్రాధాన్యత లేదని ఆగమ సలహా మండలి సభ్యులతో పాటుగా ప్రధాన అర్చకులు అభిప్రాయపడుతున్నారు.

మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులను పరిరక్షించేందుకు అధికారులకు వినతి పత్రం
గతంలో సహస్రకలశాభిషేకం ఏడాదిలో ఒక్కసారి నిర్వహించేవారని, ఆర్జిత వసంతోత్సవం ఏడాదిలో మూడు సార్లు నిర్వహించేవారని చెప్తున్నారు. అయితే 2006వ సంవత్సరం నుండి ఆర్జిత వసంతోత్సవాన్ని రాంభగీచ అతిథి గృహం వద్ద వైభవోత్సవ మండపంలో రోజూ నిర్వహిస్తున్నారని చెప్తున్నారు.
మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులను పరిరక్షించటం కోసం టీటీడీ ప్రధాన అర్చకులు , ఆగమ సలహా మండలి సభ్యులు , 2019 అక్టోబర్ లో దీనిపై అధికారులకు వినతిపత్రం ఇచ్చారు . అభిషేకాలు తగ్గించాలని వారు కోరారు .

ప్రతిపాదన అంగీకరించిన టీటీడీ ధర్మకర్తల మండలి .. ఇక నుండి ఏడాదికి ఒకసారే అభిషేకాలు
గత ఏడాది నవంబర్ లో ఈ ప్రతిపాదనపై చర్చించిన ఆగమ సలహా కమిటీ సభ్యులు ఇందులో విశేష పూజలను ఏడాదికి ఒకసారి నిర్వహించాలని సూచించారు . ఇక సహస్ర కలశాభిషేకం, ఆర్జిత వసంతోత్సవాలను సాలకట్ల ఉత్సవంగా ఏడాదికొకసారి నిర్వహించాలని పేర్కొన్నారు. ధర్మకర్తల మండలి కూడా ఈ ప్రతిపాదనలపై చర్చించి అర్చకులు , ఆగమ సలహా మండలి సభ్యులు చేసిన సూచనలకు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి వారికి ఇకనుండి ఏడాదికి ఒకసారి అభిషేకాదులు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications