తిరుమలకు వైఎస్ జగన్: ఆరునెలల్లో రెండోసారి: సీఎం చేతుల మీదుగా ఆ ఉత్సవం ప్రారంభం
తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరోమారు పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించనున్నారు. ఆరు నెలల కాలంలో ఆయన తిరుమలను సందర్శించడం ఇది రెండోసారి అవుతుంది. గత ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామివారి పట్టు వస్త్రాలను సమర్పించారు. రెండు రోజుల పాటు అక్కడే గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు తిరుమల నుంచే హాజరయ్యారు. కర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ధర్మసత్రం నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో కలిసి శంకుస్థాపన చేశారు.
తాజాగా- మరోసారి ఆయన తిరుమల ఏడుకొండలవాడిని దర్శించుకోనున్నారు. దీనికోసం మంగళవారం ఉదయం ఆయన తిరుమలకు బయలుదేరి వెళ్తారు. ఆధునికీకరించిన శ్రీవారి పోటును లాంఛనంగా ప్రారంభిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే పోటు ఉత్సవానికి హాజరవుతారు. 2018లో శ్రీవారి పోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం దాన్ని టీటీడీ అధికారులు ఆధునికీకరించారు. శ్రీవారి పోటును విస్తరించారు. వాటిని వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొంటారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి వెంట- జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు.

కరోనా వల్ల ఆంక్షలను విధించడాన్ని సడలించిన తరువాత.. శ్రీవారిని దర్శించు భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం నాడు శ్రీవారిని 53,057 మంది దర్శించారు. వారిలో 16,421 మంది తలనీలాలను సమర్పించారు. ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం మూడు కోట్ల రూపాయలను దాటింది. మొత్తంగా 3.14 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. పదేళ్ల లోపు పిల్లలు, 65 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు టీటీడీ అధికారులు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఇది వరకు దీనిపై నిషేధం ఉండేది.
అలిపిరి కాలిబాట మార్గాన తెల్లవారు జామున 6 నుంచి మధ్యాహ్న్ం 2 గంటల వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 గంటల వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు.












Click it and Unblock the Notifications