వీడియో: తిరుమల శ్రీవారి భక్తుల కోసం కర్రలొచ్చేశాయ్..!
తిరుపతి: తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగడం, వాటి కదలికలు, సంచారం అధికమైన నేపథ్యంలో టీటీడీ అధికారులు పలు నిర్ణయాలను తీసుకున్నారు. భక్తుల రక్షణ కోసం తక్షణ చర్యలను చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని అమల్లోకి తీసుకొచ్చారు.
తిరుమల, శేషాచలం అటవీ ప్రాంతంలో 48 గంటల వ్యవధిలో శేషాచలం అడవుల్లో అయిదు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు కనిపించిన విషయం తెలిసిందే. వాటిని టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎలుగుబంట్లు, ఇతర వణ్యప్రాణుల సంచారం కూడా రెట్టింపైందనే నిర్ధారణకు వచ్చారు.

అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలతో పాటు మొత్తం అయిదు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు. వాటి కదలికలను పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటిని అమర్చే ప్రక్రియను చేపట్టారు.
భక్తులకు ఊతకర్రలు ఇచ్చేందుకు సిద్దమవుతున్న టీటీడీ pic.twitter.com/B7aHGSOQoX
— oneindiatelugu (@oneindiatelugu) August 16, 2023
చిరుతల సంచారం అధికమైన నేపథ్యంలో- టీటీడీ అధికారులు తక్షణ రక్షణ చర్యలను తీసుకున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు కాలి నడకన వెళ్లే భక్తులకు చేతి కర్రలను ఇవ్వాలని నిర్ణయించారు. దాన్ని అమలులోకి తీసుకొచ్చారు. కాలినడకన తిరుమలకు వెళ్లే వారికి చేతికర్రల పంపిణీని చేపట్టారు.
అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు ఒక్కొక్కరికి ఒకటి చొప్పున చేతి కర్రల పంపిణీని చేపట్టారు టీటీడీ సిబ్బంది. టీటీడీ వలంటీర్ల ద్వారా వాటిని భక్తులకు అందజేస్తోన్నారు. భక్తులకు చాలినన్ని ఊతకర్రలను ఇదివరకే సేకరించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని మోహరింపజేశారు.












Click it and Unblock the Notifications