Video leak: పార్టీ లేదు..బొక్క లేదు: టీడీపీపై అచ్చెన్న మనసులో మాట: ఏం జరుగుతోంది?
తిరుపతి: తిరుపతి లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ముంగిట్లో తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. సంకటస్థితిలో పడింది. టీడీపీ నాయకుడొకరు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడితో సాగించిన సంభాషణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైరల్గా మారాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పేర్లను సైతం ఆ ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. ఈ వీడియో క్లిప్పింగులను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియాకు విడుదల చేశారు. తిరుపతి ప్రెస్క్లబ్లో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర బలగాలతో తిరుపతి పోలింగ్: ఢిల్లీకి టీడీపీ ఎంపీలు: ఎన్నికల కమిషన్ వద్ద ఆ పంచాయితీ
కట్టుబట్టలతో మిగిలా..
టీడీపీని నమ్ముకుని తాను రోడ్డున పడ్డానని, కట్టుబట్టలతో మిగిలానని ఆ నాయకుడు విమర్శంచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన బాధలను నారా లోకేష్తో చెప్పుకోగా.. సూసైడ్ చేసుకోమని సలహా ఇచ్చాడని ఆయన వాపోయారు. దీనికి అచ్చెన్నాయుడు బదులిస్తూ ఆయనే సరిగ్గా ఉంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని సముదాయించడం ఈ వీడియోలో రికార్డయింది. 12 కోట్ల రూపాయలను తాను పార్టీ కోసం ఖర్చు పెట్టానని, తనను ఆదుకోవాలని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్దాయన (చంద్రబాబు)ను కలిసి అభ్యర్థించానని ఆయన చెప్పారు.
17 తరువాత ఫ్రీ అయిపోతాం..
ఈ 17వ తేదీ (తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్) తరువాత అందరం ఫ్రీ అయిపోతామని అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ తరువాత పార్టీ లేదు.. బొక్కా లేదని వ్యాఖ్యానించడం వీడియోలో స్పష్టంగా రికార్డయింది. దానికి ఆ నాయకుడు- అయిపోయంది సార్ పార్టీ అయిపోయింది. మీరేమైనా అనుకోండి.. పార్టీ జీరో అయిపోయింది.. అని బదులిచ్చారు. పార్టీ కీలక నాయకులను తాను సంప్రదించడానికి ప్రయత్నించగా ఎవరూ ఫోన్లు కూడా లేపట్లేదని ఆ నాయకుడు అచ్చెన్నాయుడికి వివరించారు. 30 సంవత్సరాలు తాను పార్టీ కోసం కష్టపడితే చివరికి తన ఫోన్ కాల్స్కు కూడా సమాధానం ఇవ్వలేనంత అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం దున్నపోతు..
ఈ వీడియో క్లిప్పింగులను మీడియాకు విడుదల చేసిన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అచ్చెన్నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనను శ్రీకాకుళం దున్నపోతుగా విమర్శించారు. ఏ టీడీపీకైతే అచ్చెన్న అధ్యక్షుడిగా ఉంటున్నారో.. అదే పార్టీకి వ్యతిరేకంగా స్వయంగా ఆయనే వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడదే టీడీపీకి ఓటు వేయాలంటూ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను అభ్యర్థిస్తారని దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. పద్ధతి ప్రకారం ఉన్నాం కాబట్టే పార్టీలో కొనసాగుతున్నామంటూ అచ్చెన్నాయుడి స్థాయి నాయకుడే వ్యాఖ్యానించారని, టీడీపీకి తిరుపతి ప్రజలు ఎందుకు ఓటేయాలని నిలదీశారు.
దైవం మానుష్య రూపేణా..
దైవం మానుష్య రూపేణా అనే తరహాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్రమం తప్పకుండా అందుకుంటోన్న ప్రతి కుటుంబం ఇదే అభిప్రాయంతో ఉందని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్ జగన్ దేవుడిలాంటివాడని చెప్పారు. వేంకటేశ్వర స్వామి వారు కొలువైన ఈ తిరుమల, తిరుపతిలో టీడీపీ బాగోతం ఏమిటో.. స్వయానా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నోటి వెంటే వెలువడిందని అన్నారు. పనైపోయిందని చెబుతోన్న టీడీపీకి తిరుపతి ప్రజలు ఓటు వేయబోరని అన్నారు. అయిదు లక్షలకు పైగా మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గెలుస్తారని చెప్పారు.