టీటీడీ ప్రతిష్ట దిగజార్చిన వారికి పదవులా..! రమణదీక్షితులు ఎంట్రీపై చంద్రబాబు ఫైర్
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీలో రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయ్యింది. ఆయన ఆగమశాస్త్ర సలహాదారుగా నియమితులయ్యారు. టీటీడీలో రమణదీక్షితులు ఎంట్రీపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిటిడి ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తిని తిరిగి టిడిపిలోకి తీసుకోవడం ఏమిటి అని ఆయన ఏపీ సర్కార్ ను ప్రశ్నించారు.

చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు .. రమణ దీక్షితులు రీ ఎంట్రీపై ఆగ్రహం
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటుందో తెలియడం లేదని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక నేటితో చిత్తూరు జిల్లాలో పర్యటన ముగియనున్న నేపథ్యంలో రమణదీక్షితులు ఎంట్రీపై మాట్లాడిన చంద్రబాబు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు ఏపీ ప్రభుత్వం తిరుమల ఆగమ సలహాదారుగా అవకాశం కల్పించడంపై భగ్గుమన్న ఆయన టిటిడి ని వైయస్ జగన్మోహన్ రెడ్డి నాశనం చేయాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.

టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తికి కీలక పదవి ఎలా ఇస్తారన్న బాబు
టిటిడి ప్రతిష్టను దిగజార్చే,స్వామివారి పింక్ డైమండ్ విషయం లో రచ్చ రచ్చ చేసిన రమణదీక్షితులును తిరిగి విధుల్లోకి తీసుకోవడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంతే కాదు రమణదీక్షితులు పై టిటిడి వేసిన పరువు నష్టం దావా సైతం వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నదని పేర్కొన్నారు చంద్రబాబు. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎన్నో ఆరోపణలు వచ్చిన ఆయనను ఆగమ శాస్త్ర సలహాదారుడిగా నియమించటం ఏంటి అని చంద్రబాబు వైసీపీ సర్కార్ ను ప్రశ్నించారు. ఇక అంతే కాదు ఆయనను ప్రధాన అర్చకులుగా కూడా నియమిస్తారేమో అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.

అన్యమతస్తులకు ఉన్న విశ్వాసం కూడా వెంకన్న మీద జగన్ కు లేదన్న బాబు
తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన అన్య మతస్థులు సైతం స్వామి పై విశ్వాసం ఉందని అఫిడవిట్ సమర్పిస్తారని చంద్రబాబు గుర్తు చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన సోనియాగాంధీ, కలాం వంటి వారు అఫిడవిట్ ఇచ్చి మరి స్వామిని దర్శించుకున్నారన్న చంద్రబాబు ఇప్పటి వరకు జగన్ ఆ పని చేయలేదని ఆరోపణలు గుప్పించారు. తన మతం పేరు చెప్పుకొని అఫిడవిట్ ఇచ్చే ధైర్యం లేని జగన్ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు.

హిందూ సాంప్రదాయాలు తుంగలోతొక్కి జగన్ దారుణాలు చేస్తున్నారన్న బాబు
ఇక అంతే కాదు హిందువుల ఇళ్లలో మరణాలు సంభవిస్తే ఏడాది వరకు ఆలయాలకు వెళ్లరని పేర్కొన్న చంద్రబాబు జగన్ మాత్రం అలాంటి హిందూ సాంప్రదాయాలకు స్వస్తి చెప్పి పట్టు వస్త్రాలు తీసుకుని మరీ తిరుమలకు వెళ్లారని ఆరోపణలు గుప్పించారు. జగన్ చాలా దారుణాలు చేస్తున్నారని, ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు.అంతేకాదు ఆ వెంకన్న వద్ద జగన్ ఆడుతున్న నాటకాలు ఇంకెంతో కాలం సాగవని హెచ్చరించారు చంద్రబాబు. దేవుడి తో ఆటలాడుకుంటున్న జగన్ బాగుపడే అవకాశాలు లేవని విమర్శలు గుప్పించిన చంద్రబాబు రమణదీక్షితులు రీ ఎంట్రీ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications