సీఎం మనోడే..తిరుమల మనదే: జగన్ బాబాయ్ బర్త్డే వేడుకలు: నిబంధనలు బేఖాతర్..!
తిరుమల పవిత్ర కాపాడుతా. గత ప్రభుత్వం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరించింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలువురు నేతలు చెప్పిన మాటలు. ఇక, సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తరువాత అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ అయిన నలభై రోజుల్లోనే ఆయన బంధువులు తిరుమలలో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. శ్రీవారి నిలయం అయిన తిరుమల కొండ మీద ఉన్న నిషేదాజ్ఞలను ఉల్లంఘించి సీఎం బంధువు తన జన్మదిన వేడుకను నిర్వహిం చారు. ఇప్పుడు ఈ వ్యవహారం ప్రభుత్వం పైన విమర్శలకు కారణంగా మారుతోంది.

తిరుమల కొండపైన కేక్ కట్ చేసి...
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన బంధువులే ఆయనపైన విమర్శలకు అవకాశం ఇస్తున్నారు. రాజకీయ వ్యవహారాలు ఎలా ఉన్నా..కోట్లాది భక్తుల మనోభావాలతో ముడి ఉన్న అంశాల్లోనూ నిబంధనల ప్రకారం నడుచుకోవ టం లేదు. తాజాగా ముఖ్యమంత్రి సొంత బాబాయ్ తిరుమల కొండ పైన తన జన్మదిన వేడుకలను నిర్వహించటం ..ఆ సమయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది. ముఖ్యమంత్రి జగన్ బాబాయి..పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్రెడ్డి తన పుట్టినరోజు వేడుకను ఆదివారం తిరుమలలోని ఓ హోటల్లో జరుపుకొన్నారు. ఉదయం వీఐపీ బ్రేక్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డితో కలిసి మనోహర్రెడ్డి శ్రీవారిని దర్శించుకు న్నారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ హోటల్లో వైసీసీ నేతల సమక్షంలో మనోహర్రెడ్డి బర్త్డే కేక్ కట్ చేశారు. అయితే కేక్ కట్చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించటం నిషిద్ధమైన తిరుమలలో ఆయన కేక్ కట్ చేయటంపైనే ఇప్పుడు చర్చ మొదలైంది. తిరుమల కొండ మీద కేక్ల అమ్మకాలు నిషేధం. అయితే, కొండ మీదకు వీరిని కేక్తో సహా ఎలా అనుమతించారనేది ఇప్పుడు మరో ప్రశ్న.

జగన్ అలా..బంధువులు ఇలా..
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు తిరుమల వెళ్లారు. మెట్ల మార్గం నుండి కాలి నడకన తిరుమల చేరుకున్నారు. సామాన్య భక్గుడి తరహాలో క్యూ లైన్లో వెళ్లి దర్శనం చేసుకున్నారు. టీటీడీలో సంపూర్ణ ప్రక్షాళన దిశగా వైవీ సుబ్బారెడ్డికి చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఎనిమిదేళ్లుగా కొండ మీదే పాతుకుపోయిన జేఈవో శ్రీనివాస రాజు వంటి వారిని సాగనంపారు. నేడో..రేపో టీటీడీ కొత్త పాలక వర్గాన్ని నియమిస్తున్నారు. తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఎప్పటికప్పుడు సీఎంకు తిరుమలకు సంబంధించిన సమాచారంతో పాటుగా సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సైతం తిరుమలలో భక్తుల మనోభావాలకు అనుగుణం గా తీసుకోవాల్సిన చర్యల పైన సీఎంకు సూచనలు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ తిరుమల వెళ్లిన సమయం లో ఎక్కడా తన పైన ఆరోపణలకు...ఇతరత్రా వ్యక్తిగత అంశాల పైన ప్రస్తావనకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జగన్ ఇలా ఉంటే..ఆయన బంధువులు మాత్రం ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.

ప్రభుత్వానికి డామేజ్ తప్పదు..
వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమలలో సంస్కరణల దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆ సమయంలోనూ వైయస్సార్ ఏడు కొండలుగా ఉన్న తిరుమలను మూడు కొండలకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ఆయనకు ఆ రోజులల్లో చాలా నష్టం కలిగించాయి. దానిని భర్తీ చేసుకోవటానికి నాడు వైయస్ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బాధ్యతగా ఉండాల్సిన పార్టీ నేతలు..అందునా స్వయంగా సొంత బాబాయ్ తిరుమల నిబంధనలను బేఖాతర్ చేస్తూ తన జన్మదిన వేడుకలను తిరుమల కొండ మీద కేక్ కోసం జరుపుకోవటం ఖచ్చితంగా కొత్త సమస్యలను తెచ్చి పెడు తోంది. దీని పైన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డితో పాటుగా అధికారులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications