తిరుమలలో మొత్తం 743 మంది సిబ్బందికి కరోనా ... ఇప్పటివరకు ముగ్గురు మృతి : టీటీడీ ఈవో
తిరుమల తిరుపతి దేవస్థానం లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. టీటీడీ ఉద్యోగులకు , పూజారులకు కరోనా సోకటం టీటీడీకి ఆందోళన కలిగిస్తుంది . తిరుమల పూజారులతో సహా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) యొక్క సిబ్బంది కోవిడ్ -19 పరీక్షలు చేయించుకోగా 743 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది . అయితే టీటీడీలో తాజా పరిస్థితి, మీడియాలో వస్తున్న కథనాలపై టీటీడీ ఈఓ స్పందించారు .
Recommended Video
743 మంది సోకిన వారిలో జూన్ 11నుండి ఇప్పటి వరకు ముగ్గురు ఉద్యోగుల పరిస్థితి విషమించి, వారిలో వైరస్ తీవ్రంగా ఉండటంతో మరణించారని తెలిపారు. ఇప్పటివరకు 402 మంది సిబ్బంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారని 338 మంది వివిధ కరోనా సంరక్షణ సౌకర్యాల వద్ద చికిత్స పొందుతున్నారని తెలిపారు . టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
కరోనావ్యాప్తి కారణంగా మార్చిలో రద్దయిన దర్శనాలను జూన్11 నుంచి ప్రారంభించిన టిటిడి కరోనా వ్యాప్తి జరగకుండా కట్టుదిట్టమైన నియంత్రణా చర్యలను తీసుకుంటుంది. అయినప్పటికీ టీటీడీని కరోనా పట్టి పీడిస్తుంది.భౌతికదూరం,మాస్కులు ధరించడం, వైద్య పరీక్షలు చేయడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఎప్పటికప్పుడు శానిటేషన్ వంటి అన్ని జాగ్రత్తలూ టీటీడీ తీసుకున్నా టీటీడీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు .
భక్తుల రక్షణ కోసం అన్ని చర్యలు చేపడుతున్న టీటీడీ సిబ్బంది కోసం , సిబ్బంది కుటుంబాల కోసం క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుతో పాటు వైద్య సేవల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పేర్కొన్నారు టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ . కరోనావైరస్ లాక్డౌన్ తర్వాత తన ఖజానాను నింపాలనే ఉద్దేశ్యంతో టిటిడి శ్రీవారి తిరిగి తెరిచినట్లు మీడియాలో మరియు సోషల్ మీడియాలో వచ్చిన నివేదికలను సింఘాల్ ఖండించారు. భక్తుల విజ్ఞప్తి మేరకు స్వామి వారి ఆలయాన్ని తిరిగి తెరిచామని, కఠినమైన కోవిడ్ -19 చర్యలను అనుసరించి ప్రవేశానికి అనుమతి ఉందని ఆయన చెప్పారు.