తిరుమల నడక మార్గంలో వెళ్లే భక్తులు జరభద్రం- బాలుడిపై చిరుత దాడి
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మెట్ల మార్గం గుండా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తోన్న భక్తులపై ఓ చిరుత మెరుపుదాడి చేసింది. అయిదు సంవత్సరాల వయస్సున్న ఓ బాలుడిని నోట కరచుకుని ఎత్తుకెళ్లింది కూడా. మెట్ల మార్గంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ సిబ్బంది గట్టిగా శబ్దం చేేయడంతో- బాలుడిని వదిలి వెళ్లిందా చిరుత.
మెట్లమార్గం ఏడో మైలు వద్ద ఈ రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన సంభవించింది. చిరుత దాడిలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, టీటీడీ అటవీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులకు భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి మెట్ల మార్గానికి చేరుకున్నారు. బాధిత బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాలుడి వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు. మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు తీసుకుంటామని అన్నారు.
శేషాచలం కొండల్లో టీటీడీ ఆధీనంలో సుమారుగా 2,280 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. అనేక రకాల వన్యప్రాణులకు శేషాచలం కొండలు ఆవాసంగా మారాయి. జింకలు, ఎలుగు బంట్లూ, చిరుతలు, ఏనుగులు, పునుగు పిల్లులు వంటివి ఉన్నాయి. ఏటా వేసవి కాలంలో కొన్ని వన్యప్రాణులు మంచినీటి కోసం అడవి నుంచి జనసమ్మర్థం ఉండే ప్రాంతాలకు వస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళ కాలినడకన వెళ్ళే భక్తులకు రక్షణ కల్పిస్తుంటారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో తిరుమలకు భక్తుల రాకను నిషేధించిన విషయం తెలిసిందే. జనసంచారం లేకపోవడం వల్ల తిరుమల కొండల్లో చిరుతలు పెద్ద ఎత్తున కనిపించాయి. అలిపిరి మెట్లమార్గం, శ్రీవారి మెట్లు, ఘాట్ రోడ్ల మీద యథేచ్ఛగా సంచరిస్తూ కనిపించాయవి. అప్పట్లో దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే.
https://twitter.com/oneindiatelugu/status/1671934433254051840?t=J4emNDcfgAfIa3UKv1pikg&s=08కొద్దిరోజుల కిందటే ఎస్వీ జూపార్క్ సమీపంలో చిరుతను గుర్తించినట్లు స్థానికులు వెల్లడించారు. చిరుతల సంచారం అధికమైందంటూ టీటీడీ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. తిరుమల కొండల్లో చిరుతలు, ఎలుగుబంట్ల వంటి వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయని, అలిపిరి, ఎస్వీ జూపార్క్ సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు విజ్ఙప్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మెట్లమార్గం గుండా తిరుమలకుు వెళ్తోన్న భక్తులపై చిరుత దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications