భయం భయం... తిరుమలలో ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడి...
తిరుమలలో చిరుతపులి కలకలం భక్తులు,స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం(అగస్టు 4) తిరుమల ఘాట్ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడికి యత్నించింది. అలిపిరి నుంచి 4కి.మీ దూరంలో ఉన్న రెండో తిరుమల ఘాట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
చిరుత దాడి సమయంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్విచక్ర వాహనదారుడిని రక్షించే ప్రయత్నం చేయగా... అతనిపై కూడా దాడి చేసినట్లు సమాచారం. అయితే ఎలాగోలా ఆ వాహనదారుడు,ట్రాఫిక్ కానిస్టేబుల్ పులి బారినుంచి తప్పించుకుని బయటపడ్డారు. పులి దాడిపై సమాచారం అందగానే విజిలెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే చిరుత అడవిలోకి పారిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

శనివారం(అగస్టు 1) కూడా తిరుమల గోగర్భం నర్సరీ సమీపంలోనూ చిరుత కలకలం రేపింది. మూడు చిరుత పిల్లలతో పాటు ఒక పెద్ద చిరుత సంచరిస్తున్నట్లు ఓ ఉద్యోగి గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుత కోసం వెతికారు.
Recommended Video
అయినప్పటికీ దాని జాడ తెలియకపోవడంతో సెన్సర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కరోనా లాక్ డౌన్ పీరియడ్లోనూ తిరుమల వీధుల్లో వన్య మృగాలు సంచరించిన సంగతి తెలిసిందే. చిరుతపులులు,ఎలుగు బంట్లు పలు అటవీ జంతువులు తిరుమలలో ప్రత్యక్షమై హల్చల్ చేశాయి.












Click it and Unblock the Notifications