శ్రీవారి భక్తుల సహనానికి పరీక్ష: మొరాయించిన టీటీడీ వెబ్సైట్
తిరుపతి: తిరుమలలో వెలిసిన శ్రీవారి దర్శనానికి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన లక్షలాది మంది భక్తులకు నిరాశను మిగిల్చిన సందర్భం ఇది. మార్చి నెలకు సంబంధించిన టికెట్లను జారీ చేయడానికి కొన్ని గంటల ముందు టీటీడీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ అధికారిక వెబ్సైట్ స్తంభించింది. పని చేయడానికి మొరాయించింది. కొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. ఈ పరిణామాలు- శ్రీవారి భక్తులకు తీవ్ర అసహనానికి గురి చేశాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద తమ ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తూ వేల సంఖ్యలో పోస్టులు పెట్టారు.

9 నుంచి
లక్షలాదిమంది భక్తులు ఒక్కసారిగా టికెట్లను బుక్ చేసుకోవడానికి పోటెత్తటం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని టీటీడీ అధికారులు చెబుతున్నారు. శ్రీవారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మార్చినెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఉదయం 9 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ద్వారా ఈ 300 రూపాయల టికెట్లను బుక్ చేసుకునే వీలు కల్పించింది.

కోటా పెంపు..
300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను సైతం 25,000కు పెంచింది. గురువారం నుంచి శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్ల జారీ ప్రక్రియను కొనసాగించనుంది. అదనపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడుదల చేసింది. రోజుకు 25,000 వేల టికెట్లను జారీ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఆఫ్లైన్ ద్వారా రోజూ 20 వేల స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన టీటీడీ కౌంటర్లలో ఆఫ్లైన్ టికెట్ల జారీ ఉంటుంది.

మొరాయించిన వెబ్సైట్..
అంతా బాగానే ఉన్నప్పటికీ- టికెట్ల బుకింగ్ కోసం భక్తులు పోటెత్తడంతో వెబ్సైట్ స్తంభించిపోయింది. వేర్వేరు దశల్లో వెబ్సైట్ పని చేయడం మానేసింది. వెబ్సైట్పై క్లిక్ చేసిన తరువాత అది ఓపెన్, టికెట్లను బుక్ చేసుకున్న అనంతరం పేమెంట్ చెల్లించే సమయంలో ఎర్రర్ చూపడం, స్లాట్లు బుక్ కాలేకపోవడం వంటి సాంకేతిక లోపాలు వెబ్సైట్లో కనిపించాయి. టికెట్లు బుక్ అయిన తరువాత పేమెంట్ సర్వర్ డౌన్ అయినట్లు తేలడం వంటి పరిణామాలతో లక్షలాది మంది భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

ట్రెండింగ్లో..
శ్రీివారి టికెట్ల బుకింగ్లో ఎదురైన అనుభవాలను వివరిస్తూ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. వెబ్సైట్లో కనిపించిన ఎర్రర్లను స్క్రీన్ షాట్లుగా తీసి, తమ కామెంట్స్కు జత చేశారు. సాధారణంగా- టీటీడీ అధికారులు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం టికెట్లను విడుదల చేసిన వెంటనే- భక్తులు పెద్ద సంఖ్యలో వెబ్సైట్ మీదికి రావడం సహజం జరిగేదే. ప్రతినెలా టికెట్ల కోటా విడుదలైన తరువాత భక్తులు సాఫీగా టికెట్లను బుక్ చేసుకునే వారు.

కోటా పెంపు వల్లేనా?
ఇప్పుడు మాత్రం టీటీడీ వెబ్సైట్ ఎంతకూ పని చేయకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. టికెట్ల సంఖ్యను పెంచడం వల్ల ఇదివరకటి కంటే ఈ నెల భక్తుల సంఖ్య భారీగా ఉంటుందని టీటీడీ అధికారులు ముందుగానే అంచనా వేసినప్పటికీ.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోలేకపోవడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. ఇంత అధ్వాన్నంగా టీటీడీ వెబ్సైట్ ఇదివరకెప్పుడూ లేదంటూ వ్యాఖ్యానిస్తోన్నారు.












Click it and Unblock the Notifications