అమిత్ షా అంటే వైసీపీకి భయం! నాకు చేతులెత్తి మొక్కాలి: బీజేపీతో స్నేహంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికరం
తిరుపతి: ఎంతో కష్టపడితే గానీ రాష్ట్రానికి పరిశ్రమలు రావని.. కానీ, అలా వచ్చే పారిశ్రామికవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం తిరుతిపతిలో తిరుపతి, కడప, రాజంపేట, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

పారిశ్రామికవేత్తలను బెదిరిస్తారా?
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కియా వంటి పరిశ్రమ సీఈఓను బెదిరిస్తే రాష్ట్రానికి ఎవరు వస్తారు? అని ప్రశ్నించారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటున్నారని.. అసలు పరిశ్రమలు వస్తున్నాయా? అని నిలదీశారు. యురేనియం తవ్వకాల వల్ల పరిసర గ్రామాల్లో కలుషితమయ్యాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రాన్ని అడగకుండా.. యురేనియం శుద్ధి పరిశ్రమ కోరతారా? అని జగన్ సర్కారును నిలదీశారు.

ఎవరి అండతో మతమార్పిడులు?
ఆంగ్లమాధ్యమం విషయంలో తాను చేస్తున్న వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఆంగ్ల మాధ్యమాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించడం లేదని అన్నారు. పరిపాలనా భాషగా తెలుగును అమలు చేయాలన్నారు. హిందూధర్మ పరిరక్షణపై చేసిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించారని పవన్ అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందని స్థానికులు వాపోతున్నారని తెలిపారు. ఎవరి అండతో రాష్ట్రంలో సామూహిక మతమార్పిడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ..
రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కారుపూర్తిగా విఫలమైందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఉల్లిని కూడా అందించలేకపోతోందని అన్నారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వం కూల్చివేతలపై దృష్టి పెట్టింది కానీ.. రైతుల సమస్యలపై దృష్టి సారించలేదన్నారు. రాయలసీమను కావాలనే పాలకులు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

బీజేపీకి దూరంగా లేను.. కాలేదు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని బీజేపీలో కలిపేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం, అమిత్ షాను పొగడాల్సిన అవసరం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నించడం ఆయన స్పందించారు. తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేనని, కలిసే ఉన్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సహా కొన్ని అంశాల కోసమే విమర్శలు చేశాను తప్ప.. బీజేపీకి ఏరోజూ దూరం కాలేదని అన్నారు.

అమిత్ షా అంటే వైసీపీకి భయం.. నాకు గౌరవం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటే తనకు ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ నేతలకు అమిత్ షా అంటే భయమని.. తనకు మాత్రం గౌరవమని అన్నారు. తాము టీడీపీతో ఉంటే ఎన్నికల్లో వారితోనే కలిసి పోటీ చేసేవాళ్లమని, విడిగా పోటీ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

నాకు వైసీపీనేతుల రెండు చేతులెత్తి మొక్కాలి..
వైసీపీ నేతలు తనకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలని అన్నారు. తాను టీడీపీ, బీజేపీతో కలిసి మళ్లీ ఎన్నికల్లో పోటీచేసివుంటే వైసీపీ ఎక్కడ ఉండేదని.. అధికారంలోకి వచ్చేదా? పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎంతమందితో వైసీపీ వాళ్లు తన దగ్గరికి వచ్చారో గుర్తు లేదా అని అన్నారు. దక్షిణాదిలో రెండో రాజధాని ఉండాలన్నది తన మాట కాదని.. బీఆర్ అంబేద్కర్ మాటలను తాను చెప్పానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications