తెలుగు సినీ హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు: జగన్ సర్కారుకు హెచ్చరిక
హైదరాబాద్: తెలుగు భాషను కాపాడుకోవాలంటూ ఉద్యమం చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినీనటులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తెలుగు వైభవం పేరుతో భాషా పండితులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

సర్వనాశనం చేస్తుందంటూ హెచ్చరిక
ఒకే భాష మాట్లాడే వారికి ఒకే రాష్ట్రం ఉండాలని పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్న నాయకులు.. తెలుగు భాషను పరిరక్షించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారన్నారు. ఆంగ్ల మాధ్యమానికి జనసేన పార్టీ వ్యతిరేకం కాదని, పిల్లలను ఏ మాధ్యమంలో చదివించాలో తల్లిదండ్రులకే స్వేచ్ఛ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామన్నారు. తెలుగు భాష... జ్ఞాన సరస్వతి.. అలాంటి భాషామూలలను చంపేయాలని చూస్తే ఆ జ్ఞాన సరస్వతే.. అపర దుర్గదేవిగా అవతారమెత్తి మిమ్మల్ని సర్వనాశనం చేస్తుందని పవన్ కళ్యాణ్ పరోక్షంగా జగన్ సర్కారును హెచ్చరించారు.

తప్పుడు పని చేయాలంటే..
‘మాతృ భాషను క్షుణ్ణంగా నేర్చుకుంటే ఏ భాషనైనా అవలీలగా నేర్చుకోవచ్చు. తెలుగు భాషను నేర్చుకోవడం ఓం తో మొదలుపెడతాం. దానర్ధం పరామాత్ముడు నుంచి విడిపోయావు మళ్లీ పరమాత్ముడి దగ్గరకే చేరాలని ఓంకారంతో భాషను నేర్పుతారు. సుమతి, వేమన శతకాలు చదివితే నైతిక బలం వస్తుంది. తప్పుడు పని చేయాలంటేనే భయమేస్తుంది' అని వ్యాఖ్యానించారు.

తెలుగు సినీ హీరోలపై సంచలన వ్యాఖ్యలు
‘తెలుగు సినీ పరిశ్రమలో పాండిత్యం రాను రాను దిగజారిపోతోంది. మన రచయితలకు శాస్త్రా, కావ్యాలు గురించి తెలియవు. మేడసాని మోహన్ వంటి గొప్ప అవధానులను ప్రేరణగా తీసుకుంటే గొప్ప గొప్ప సినిమాలు వచ్చేవి. తెలుగు సినిమా స్థాయి బూతులు, తిట్లు స్థాయికి పడిపోయింది. ఈ స్థాయికి ప్రమాణాలు దిగజారిపోయాయి కనుకే ఆడపిల్లలను రోడ్ల మీదే అత్యాచారాలు చేస్తున్నారు. మాతృభాషను మరచిపోతే వచ్చిన దుస్థితి ఇది. చాలా మంది తెలుగు హీరోలకు తెలుగు మాట్లాడం తెలుసో లేదో నాకు తెలియదు కానీ.. రాయడం మాత్రం సరిగా రాదు. తెలుగు సినిమాలు చేస్తారు. డబ్బులు ఇక్కడే సంపాదిస్తారు కానీ తెలుగు రాయడం, ఉచ్ఛరించడం మాత్రం తెలియదు. ఒక తెలుగు హీరోగా ఇవన్ని ఆవేదన కలిగించాయి. మన భాష, సంస్కృతులను కాపాడుకోలేకపోతే అధోగతి పాలవుతాం' అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మొదట భద్రత కల్పించండి...
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియంతోపాటు 1481 ఉర్దూ, 82 తమిళం, 32 హిందీ, 1 బెంగాలీ, 41 కన్నడ, 197 ఒరియా పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులలో తెలుగు, ఉర్దూ ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించింది. మరి మిగిలిన భాషల పరిస్థితి ఏంటి..?. ప్రాంతీయ భాషను నేర్చుకోకపోతే సంస్కృతిని చంపేసినట్లే. మన సంస్కృతిని విస్మరించడం వల్లే ఇవాళ ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అరకు లోయలో హాస్టల్స్ లో చదువుకునే అమ్మాయిలతో మాట్లాడితే .. రాత్రి పూట పడుకునేటప్పుడు భయమేస్తుందని, సరైన ప్రహారిగోడ లేకపోవడం ఆకతాయిలు రాళ్లు విసురుతున్నారని బాధపడ్డారు. ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణ మనందరి బాధ్యత. ఇంగ్లీషు మీడియంపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ ఆడపిల్లల భద్రతపై పెట్టాలి. ఇంట్లో నుంచి పాఠశాలకు వెళ్లిన ఆడబిడ్డలు తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేలా బస్సు సౌకర్యం కల్పించాలి' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఇంగ్లీష్ మీడియం చదుకున్నవాళ్లు జైలుకెళ్తున్నారు..
‘ఇవన్నీ వదిలేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే అద్భుతాలు జరిగిపోతాయని తప్పుడు సంకేతాలను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంత అద్భుతాలు జరిగితే ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న వాళ్లు ఎందుకు జైలుకు వెళ్తున్నారు. ఇంగ్లీషు మాధ్యమం చదివినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఆంగ్ల పదం లేకుండా తెలుగు మాట్లాడలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను. కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరుని సాక్షిగా తిరుమలలో మన నుడి - మన నది కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నది ఉన్నచోట సంస్కృతి, భాష పరిఢవిల్లుతాయి. తెలుగు భాష పరిరక్షణ కార్యక్రమం ప్రభుత్వాలు చేసేది కాదు. ప్రజలు, విద్యావేత్తలు, పండితులు, ఆచార్యులు నడిపేది. తెలుగు భాష సంరక్షణ కోసం తిరుపతిలో తొలి అడుగుపడింది. ప్రతి జిల్లాలో తెలుగు భాష పరిరక్షణ కోసం కార్యక్రమాలు రూపొందిస్తాం. పండితులు, భాషాభిమానుల సలహాలు, సూచనలు తీసుకొని తెలుగు సంరక్షణను భాష ఉద్యమంగా, సంస్కృతిని పరిరక్షించే ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తాం' అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications