టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు నియామకం... పాలకమండలి సమావేశంలో నిర్ణయాలివే
టీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరిగింది . ఈ సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పాలక మండలి సమావేశంలో ముఖ్యంగా రమణదీక్షితులును గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాలకు కారణమైన రమణ దీక్షితులు వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ను కలిసిన విషయం తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలోనే ఆయనను గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
TTD: టీటీడీ కీలక నిర్ణయం: సంక్రాంతి తరువాత కఠినంగా అమలు..!
రూ.3243 కోట్ల వార్షిక రివైజ్డ్ బడ్జెట్ కు పాలకమండలి ఆమోదం
ఇక అంతేకాదు 2019-20 టీటీడీ బడ్జెట్ ను కూడా ప్రకటించారు. రూ.3243 కోట్ల వార్షిక రివైజ్డ్ బడ్జెట్ కు పాలకమండలి ఆమోదం తెలిపింది. అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.8 కోట్లతో రెండు ఘాట్ రోడ్డుల మరమ్మతులకు అనుమతులు ఇచ్చింది. రూ.10 కోట్లతో రెండో ఘాట్రోడ్డులో క్రాష్ బ్యారియర్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రూ.3.4 కోట్లతో తిరుపతిలోని కళ్యాణమండపాలకు ఏసీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది పాలక మండలి.
వారాణాసి, ముంబై, జమ్మూ కాశ్మీర్ లలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఆమోదం
ఇక దేశంలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కూడా నిర్ణయం తీసుకుంది. పరిపాలన భవనం మరమ్మతులకు రూ.14.5 కోట్లు కేటాయించినట్లు తెలుస్తుంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆమోదం తెలిపింది.రూ.30 కోట్లతో ముంబైలో ఆలయ నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. అంతేకాకుండా జమ్మూకశ్మీర్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కూడా టీటీడీ ఆమోదించింది. శ్రీవరహస్వామి ఆలయంలో గోపురం బంగారు తాపడానికి రూ.14కోట్లు కేటాయించింది పాలక మండలి .
తిరుమల పరిరక్షణ కు పలు కీలక నిర్ణయాలు
సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకు కూడా టీటీడీ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా తిరుమల బర్డ్ డైరెక్టర్గా మదన్ మోహన్ రెడ్డి నియామిస్తూ నిర్ణయం తీసుకున్నారు . వైకుంఠ ఏకాదశి రోజున రెండు రోజుల పాటు... భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు. లడ్డూ ప్రసాదాలపై టీటీడీ ఏటా రూ.200 కోట్లు సబ్సిడీ ఇస్తోంది. ఇక దీనిపై తిరుమల ఆడిషనల్ ఈవో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.