చంద్రబాబుపై రాళ్ళ దాడి ఆధారాల్లేవన్న డీఐజీ .. తిరుపతి ఇష్యూ సీరియస్ అంటున్న తెలుగు తమ్ముళ్ళు !!
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం వేళ టీడీపీ అధినేత చంద్రబాబు సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్టు పేర్కొన్న తెలుగుదేశం పార్టీ నేతలు దీనికి బాధ్యులు వైసీపీ నేతలే అంటూ ఏపీ లోని జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు సభపై రాళ్ల దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతిరాణా టాటా తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ప్రస్తుతం తమ విచారణలో కనిపించలేదని వెల్లడించారు .

రాళ్ళ దాడి ఘటనపై విచారణ జరిపాం .. కానీ ఆధారాల్లేవ్
తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాళ్లు తగిలాయని ఇద్దరు కార్యకర్తలు చెప్పారన్నారు .ఈ ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశామని , సీసీ టీవీ ఫుటేజ్ కూడా పరిశీలించామని , ప్రత్యక్ష సాక్షులను సైతం విచారించామని డీఐజీ తెలిపారు. చంద్రబాబు భద్రత సిబ్బందిని విచారించి, ఆయన కాన్వాయ్ ను సైతం పరిశీలించామన్నారు. ఈ ఘటనపై ఆధారాలు ఉంటే వెంటనే ఇవ్వాలని చంద్రబాబు కు నోటీసు ఇచ్చామని డీఐజీ పేర్కొన్నారు.

పోలీసులపై ఆరోపణలు నిరాధారం .. గట్టి భద్రత కల్పించాం
తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు.
రాళ్ల దాడి ఘటనలో పోలీసులపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రచార సభకు సరిపడా భద్రత కల్పించామని పేర్కొన్న డిఐజి పోలీసుల పై ఈ విధమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు సభకు ఎలాంటి అంతరాయం కలగలేదని, ఆయన ప్రచార వాహనానికి ఎలాంటి నష్టం జరగలేదని డిఐజి వెల్లడించారు. నిన్నటికి నిన్న తిరుపతిలో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాటకాలాడుతున్నారని , ఎలాంటి రాళ్ళ దాడి జరగలేదని హోం మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు .

కార్యకర్తలపై రాళ్ల దాడి జరగడం పట్ల చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
ఇదిలా ఉంటే చంద్రబాబు పాల్గొన్న రోడ్ షో లో కార్యకర్తలపై రాళ్ల దాడి జరగడం పట్ల చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. టిడిపి శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు . తిరుపతి నగరంలో అంబేద్కర్ కూడలి నుండి గాంధీ విగ్రహం కూడలి వరకు పాదయాత్ర నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి రాళ్ల దాడికి పాల్పడడం అప్రజాస్వామికమని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు .

ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదులు , రెండు లక్షల నకిలీ ఓటర్ కార్డులపై కూడా కంప్లైంట్
ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు రాళ్ల దాడి ఘటనపై ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు , కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను కలిసి తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు . పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెండు లక్షల నకిలీ ఓటర్ కార్డులు ఉన్నాయని, రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఇవ్వాలని వారు కోరారు. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ వాలంటీర్లను భాగస్వాములు చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు .

కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన టీడీపీ , అసలు దాడే జరగలేదన్న ప్రభుత్వం
ఆపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా తో కూడా టిడిపి ఎంపీలు భేటీ అయ్యి చంద్రబాబు సభపై రాళ్ల దాడి, వైసీపీ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదు అని ఆరోపించారు. ఒక పక్క అసలు రాళ్ళ దాడి జరగలేదని పోలీసులు, హోం శాఖా మంత్రి తేల్చి చెప్తుంటే టీడీపీ నేతలు మాత్రం విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు . రేపటితో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపధ్యంలో ఈ వ్యవహారంలో ఏం జరగబోతుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది .












Click it and Unblock the Notifications